ఉక్కు దీక్ష‌ల‌కు మ‌ద్ద‌తు…టైమింగంటే శివాజీదేన‌బ్బా

సినీ న‌టుడు శివాజీకి సినిమాల్లో ఆశించినంత‌గా గుర్తింపు రాలేదు గానీ… రాజ‌కీయాల్లోకి ప్ర‌త్య‌క్షంగా ఎంట్రీ లేకున్నా… ఆయా స‌మ‌స్య‌లపై త‌న‌దైన శైలి టైమింగ్ తో ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న‌కు ఎన‌లేని గుర్తింపు వ‌చ్చింద‌నే చెప్పాలి. ఏపీపై కేంద్రం స‌వ‌తి త‌ల్లి ప్రేమ చూపిస్తోందంటూ అప్పుడెప్పుడో గ‌రుడ పురాణం పేరిట ప్ర‌త్యేక ప‌రంప‌ర‌ను కొన‌సాగించిన శివాజీ…. ఏపీలో కొత్త‌గా కొలువుదీరిన జ‌గ‌న్ స‌ర్కారు వైఖ‌రి, ప్ర‌ముఖ టీవీ ఛానెల్ టీవీ9 వివాదంతో తెర మ‌రుగు కాక త‌ప్ప‌లేదు.

అయితే ఎప్పుడైనా త‌న‌దైన శైలి టైమింగ్ తో విరుచుకుప‌డే శివాజీ… పొలిటిక‌ల్ సినారియోలోకి మ‌రోమారు స‌రికొత్త‌గా ఎంట్రీ ఇచ్చేశారు. ఏపీలో ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయిన విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా సాగుతున్న దీక్ష‌ల‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన శివాజీ.. బుధ‌వారం సాగ‌ర న‌గ‌రం విశాఖ‌లో ప్ర‌త్యక్ష‌మ‌య్యారు.

ఏ ఒక్క‌రూ ఊహించ‌ని విధంగా రీ ఎంట్రీ ఇచ్చిన శివాజీ… విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ ప్రైవేట్ ప‌రం అయిపోతోంద‌ని ఏడాది క్రిత‌మే తాను చెప్పిన విష‌యాన్ని తాజాగా ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా ఉక్కు దీక్ష‌ల‌కు మ‌రింత బలం ఇచ్చే రీతిలో ప్ర‌సంగించిన శివాజీ… ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫ‌లితంగానే రాష్ట్రానికి విశాఖ ఉక్కు వ‌చ్చింద‌ని గుర్తు చేశారు. అలాంటి ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేట్ ప‌రం చేసే దిశ‌గా ఏడాది క్రిత‌మే బీజం ప‌డిన విష‌యాన్ని ముందే చెప్పాన‌ని గుర్తు చేశారు.

పోరాడితే పోయేదేముంది… బానిస సంకెళ్తు త‌ప్ప‌.. కార్మికులంతా సింహ గ‌ర్జ‌న చేస్తే కేంద్రంతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా దిగిరాక త‌ప్ప‌ద‌ని శివాజీ స‌మ‌ర శంఖాన్నే పూరించారు. ఈ దీక్ష‌లు పెట్టుబ‌డిదారుల‌కు, కార్మిక లోకానికి మ‌ధ్య జ‌రుగుతున్న పోరాట‌మేన‌ని కూడా శివాజీ చెప్పుకొచ్చారు.

మొత్తంగా ఏడాదికి పైగా అడ్రెస్ లేకుండాపోయిన శివాజీ… త‌న‌దైన శైలి టైమింగ్ చూసుకుని స‌రిగ్గా ఉక్కు దీక్ష‌ల్లో తిరిగి ప్ర‌త్య‌క్ష‌మైపోయారు. అంతేకాకుండా త‌న టైమింగ్ ఎలా ఉంటుంద‌న్న విష‌యాన్ని కూడా శివాజీ చెప్ప‌క‌నే చెప్పార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. దీక్ష‌ల‌కు సంఘీభావం తెలుపుతూ శివాజీ చేసిన ప్ర‌సంగం ఉక్కు క‌ర్మాగారం కార్మికుల్లో మ‌రింత శ‌క్తిని నింపేలానే ఉంద‌ని చెప్ప‌డంలోనూ ఎలాంటి సందేహం లేద‌నే చెప్పాలి.