వైజాగ్ నేర్పుతున్న పాఠం ఇది

నెలన్నరగా కరోనా వైరస్ వల్ల పడుతున్న కష్టాలు చాలవని.. విశాఖపట్నం వాసులను ఇప్పుడో పెద్ద ఉపద్రవం ముంచెత్తింది. గోపాల పట్నం ప్రాంతంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన ప్రమాదకర స్టెరీన్ గ్యాస్ 11 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. వందల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎవరి పరిస్థితి ఏమవుతుందో చూడాలి.

ప్రస్తుతానికి ప్రాణాపాయం తప్పినప్పటికీ.. ఈ గ్యాస్‌ను ఎక్కువ మోతాదులో తీసుకుని ఉంటే అవయవాలు దెబ్బ తినే ప్రమాదం ఉంది. దీర్ఘ కాలంలో కిడ్నీ సంబంధిత వ్యాధులు రావచ్చు. క్యాన్సర్ బారిన కూడా పడొచ్చు. ఇంకేవైనా ప్రతికూల ప్రభావాలు కూడా ఉండొచ్చని అంటున్నారు. స్టెరీన్ గ్యాస్ అంత ప్రమాదకరమైంది మరి. ఈ సమయంలో మిగతా జనం కూడా వైజాగ్ ఉదంతం నుంచి ఓ పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

ప్లాసిక్, రబ్బర్ ఉపకరణాల తయారీలో స్టెరీన్ గ్యాస్‌నే ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ పైపులు, ఆలోమొబైల్ పార్టులు, ప్యాకేజింగ్ మెటీరియల్స్, వైర్లతో పాటు నీళ్లు, టీ కాఫీలు తాగే ప్లాస్టిక్ కప్పుల్లో స్టెరీన్ గ్యాస్‌ను వాడతారు. అందుకే ప్లాస్టిక్ ఉపకరణాలు వేటిలోనూ వేడి ఆహార పదార్థాలు ఏవీ పోయకూడదని అంటారు.

అసలు తినే వస్తువులేవీ కూడా ప్లాస్టిక్ ఉపకరణాల్లో ఉపయోగించకూడదని ఎప్పుడూ నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ మనం వినం. ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగినా.. కవర్లలో ఏ వేడి ఆహార పదార్థాలు ప్యాక్ చేసి ఆ తర్వాత తిన్నా చాలా ప్రమాదం అని తెలిసినా ఏం కాదన్నట్లుగా లైట్ తీసుకుంటూ ఉంటాం. తర్వాత ఏ క్యాన్సరో, మరో పెద్ద జబ్బో ఎటాక్ అయితే.. ఏం తప్పు చేశామని దేవుడు ఇంత శిక్ష విధించాడని మొత్తుకుంటాం. అప్పుడు ఆ జబ్బులు రావడానికి కారణం ఏంటన్నది ఎవ్వరూ చెప్పలేరు. జీవితంలో నిర్లక్ష్యంతో చేసే చిన్న చిన్న పొరబాట్లే ఇలాంటి దారుణమైన ఫలితాలిస్తుంటాయి. కాబట్టి ఇక నుంచైనా ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడితే మంచిది.