అన్నింటినీ వదిలించేసుకుంటున్న మోడి

గత ఏడేళ్ళల్లో ఒక్క పబ్లిక్ సెక్టార్ యూనిట్ (పిఎస్ యు) ను కూడా పెట్టని నరేంద్రమోడి ప్రభుత్వం ఉన్న వాటిని వదిలించేసుకుంటోంది. దేశంలో ప్రస్తుతం ఉన్న 300 పిఎస్ యూలను 24కి కుదించేయాలని డిసైడ్ అయ్యింది. ఉన్నవాటిని సక్రమంగా నడిపించటం చేతకాని నరేంద్రమోడి అన్నింటినీ తెగనమ్మేయటానికి మాత్రం రెడీ అయిపోవటమే విచిత్రంగా ఉంది. తాజాగా రూపొందించిన డిజిన్వెస్ట్మెంట్ పాలసీలో భాగంగా అమ్మేయాలని అనుకున్న వాటిని రెండు రకాలు అంటే వ్యూహాత్మకం, వ్యూహాత్మకం కానివి అనే రెండు రకాలుగా విభజించింది.

వ్యూహాత్మకరంగంలోని పీఎస్ యూలని కనిష్ట స్ధాయికి తగ్గించేయాలని, వ్యూహాత్మకం కానివాటిని అవకాశం ఉన్నంతలో అమ్మేయాలని డిసైడ్ అయిపోయింది. వ్యూహాత్మకం కానివాటిల్లోని పీఎస్ యూలను అమ్మేయటం, విలీనం చేయటం సాధ్యంకాక పోతే మూసేయాలని నిర్ణయించింది. అణుశక్తి, అంతరిక్షం-రక్షణ, రవాణా-టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, బొగ్గు, పెట్రోలియం, ఇతర ఖనిజాలను డీల్ చేస్తున్న పీఎస్ యూల భారాన్ని వీలైనంత తగ్గించుకోబోతోంది.

మార్కెట్లో ప్రభుత్వ రంగం సంస్ధల పాత్రను తగ్గించేసి ఆ స్ధానంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సాహించాలని ఓ పాలసీగా పెట్టుకుంది మోడి సర్కార్. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వరంగంలోని ప్రభుత్వ వాటాలను అమ్మేయటం ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇంతవరకు బాగానే ఉన్న మంచి లాభాల్లో ఉన్న ఎల్ఐసిలో తన వాటాను ఎందుకు ఉపసంహరించుకుంటోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. అలాగే ఎల్ఐసీకి అనుబంధంగా ఉన్న ఐడిబీఐ బ్యాంకు, రెండు ప్రభుత్వరంగ సంస్ధలతో పాటు ఓ సాధారణ బీమా కంపెనీని కూడా ప్రైవేటుపరం చేసేయటానికి రంగం రెడీ అయిపోయింది.

కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్ లోని మిశ్రదాతు నిగమ్ లిమిటెడ్ (మిథాని), బీఈఎంఎల్, జీఆర్ఎస్ఈ లను తొందరలో ప్రైవేటుకు అమ్మేయబోతోంది. నిజానికి ఈ నాలుగు సంస్ధలు రక్షణ రంగానికి సంబంధించినవి. హోలు మొత్తం మీద చూస్తే అర్ధమవుతున్నదేమంటే తొందరలోనే ప్రభుత్వరంగ సంస్ధల్లో చాలావరకు ప్రైవేటుపరం అయిపోతున్నాయి. మరి 2014 ఎన్నికల సమయంలో బీజేపీ చెప్పిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన లాంటి హామీలు ఏమయ్యాయో ఎవరికీ అర్ధం కావటం లేదు.