తమిళనాడును ఆదర్శంగా తీసుకోలేరా ?

రాష్ట్రప్రయోజనాలు మనకు సంపూర్ణంగా సిద్ధించకపోవటానికి రాజకీయ పార్టీలే ప్రధాన కారణమా ? క్షేత్రస్దాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమేనా అనిపిస్తోంది. ప్రతి చిన్న విషయానికి పెద్దగా రాద్దాంతం చేయటం, ఒకరిపై మరొకరు బురద చల్లేసుకోవటం చూస్తుంటే ఈ పార్టీలకు అసలు రాష్ట్రప్రయోజనాలు పట్టవా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఉదాహరణగా తాజాగా మొదలైన వివాదాన్నే తీసుకుందాం.

వైజాగ్ స్టీల్స్ ను ప్రైవేటుపరం చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయం బయటకు వచ్చిందో లేదో వెంటనే చంద్రబాబునాయుడు, నారా లోకేష్ అండ్ కో మొదలుపెట్టేశారు. విశాఖ స్టీల్స్ ప్రైవేటుపరం చేయటానికి జగన్మోహన్ రెడ్డే కారణమంటున్నారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని సొంతం చేసుకునే ఉద్దేశ్యంతో జగనే కేంద్రంతో కలిసి కుట్ర చేశాడని చంద్రబాబు, లోకేష్ ఒకటే గోల చేసేస్తున్నారు. విశాఖ స్టీల్స్ అన్నది కేంద్రం ఆధీనంలో ఉన్న సంస్ధ. దాన్ని ప్రైవేటుపరం చేయాలని నిర్ణయం తీసుకున్నది కేంద్రం. మధ్యలో జగన్ కు ఏమి సంబంధం .

ఎప్పుడైతే విశాఖ స్టీల్స్ విషయంలో తమపై చంద్రబాబు అండ్ కో బురద చల్లటం మొదలుపెట్టారో వెంటనే మంత్రులు, వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. అసలు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నపుడు సీఎంగా చంద్రబాబే ఉన్నారంటు మంత్రులు రివర్సులో మొదలుపెట్టారు. చంద్రబాబు చేతకాని తనం వల్లే కేంద్రప్రభుత్వం ఏపిని చాలా నిర్లక్ష్యం చేస్తోందంటు ఎదురు ఆరోపణలకు దిగారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే ఏపికి సంబంధించి కేంద్రం ఎటువంటి వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా వెంటనే చంద్రబాబు అండ్ కో జగన్ పై బురద చల్లేస్తున్నాయి. అంటే జగన్ కు వ్యతిరేకంగా రాజకీయంగా లబ్దిపొందాలన్న ఆలోచనే టీడీపీ నేతల్లో కనబడుతోంది. నిజానికి వైజాగ్ స్టీల్స్ విషయంలో తప్పుపట్టాల్సింది కేంద్రాన్నైతే జగన్ను టార్గెట్ చేయటం వల్ల ఏమిటి ఉపయోగం ? నిర్ణయం తీసుకున్న నరేంద్రమోడిని ఏమీ అనే ధైర్యంలేక జగన్ పై బురద చల్లేయటమే కనబడుతోంది.

ఇటువంటి సమయంలోనే జనాల్లో తమిళనాడు రాజకీయాలు గుర్తుకొస్తున్నాయి. తమిళనాడు ప్రయోజనాల విషయంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తున్నారని అనుకుంటే వెంటనే రాజకీయపార్టీలన్నీ ఏకమైపోతాయి. రాజకీయంగా ఏ పార్టీ ఏ అజెండాతో ఉన్నా రాష్ట్రాభివృద్ధికి వచ్చేసరికి అన్నీ పార్టీలు ఒకటైపోయి ప్రత్యర్ధులపై యుద్ధం ప్రకటిస్తాయి. ఈమధ్యనే జరిగిన ‘జల్లికట్టు’ ఉదంతమే నిదర్శనం.

మరి మనకు స్వతహాగా లేకపోయినా కనీసం తమిళనాడును చూసైనా నేర్చుకోకపోతే ఎలాగని జనాలు అనుకుంటున్నారు. ఇప్పటికైనా రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఐకమత్యంతో పోరాటం చేస్తే విశాఖ స్టీల్స్ ప్రైవేటుపరం విషయంలో కేంద్రం వెనక్కు తగ్గుతుంది. లేకపోతే మనల్ని చూసి నవ్వుకుంటునే తన పని తాను కానిచ్చేస్తుంది.