రైతు ఉద్యమానికి నష్టమే జరిగిందా ?

దాదాపు రెండు నెలలపాటు ప్రశాంతంగా ఉద్యమం చేసి యావత్ దేశంతో శెభాష్ అనిపించుకున్న రైతుఉద్యమం మంగళవారం జరిగిన ఘటనలతో బాగా చెడ్డపేరు తెచ్చుకుంది. కేంద్రప్రభుత్వం రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢీల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘూ ప్రాంతంలో రైతులు రెండు నెలలుగా భారీ ఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

రైతుసంఘాలు ఎంతగా ఉద్యమం చేస్తున్న కేంద్రం పట్టించుకోలేదు. ఈ పరిస్దితుల్లో సుప్రింకోర్టు కలగజేసుకుని సమస్యను సర్దుబాటు చేద్దామని ప్రయత్నంచేసింది. ముందుగా చట్టాల అమలుపై సుప్రింకోర్టు స్టే విధించింది. తర్వాత జరిగిన పరిణామాలతో చట్టాల అమలును ఏడాదిన్నర పాటు వాయిదా వేస్తామని కేంద్రం ప్రతిపాదించింది. అయితే చట్టాల అమలును వాయిదా వేయటం కాదని రద్దు చేయాల్సిందే అని రైతుసంఘాలు పట్టుబట్టాయి.

ఒకవైపు చర్చలు జరుగుతుండగానే జనవరి 26వ తేదీన భారీ ర్యాలీని నిర్వహించబోతున్నట్లు రైతులు ప్రకటించారు. అనేక చర్యల తర్వాత చివరకు ఢిల్లీ పోలీసులు అంగీకరించారు. ఇందులో భాగంగానే మంగళవారం ఉదయం మొదలైన ర్యాలీ అనేక హింసాత్మక ఘటనలకు వేదికగా మారింది. వేలమంది పోలీసులకు, రైతులకు మధ్య అనేక ప్రాంతాల్లో పెద్దస్ధాయిలో ఘర్షణలు జరిగాయి. రైతులదే తప్పని పోలీసులు, కాదు కాదు పోలీసులదే తప్పని రైతుసంఘాలు ఇపుడు వాదులాడుకుంటున్నాయి.

ఏదేమైనా రైతులు ఎర్రకోటపైకి ఎక్కటం. అక్కడ రైతుసంఘాల జెండాను ఎగరేయటం, ఢిల్లీ వీధుల్లో పోలీసులపైకే ట్రాక్టర్లను నడిపి భయపెట్టడం లాంటి ఓవర్ యాక్షన్లతో ఢిల్లీ వీధులు గంటల కొద్దీ అట్టుడుకిపోయాయి. చివరకు టెలికాం లైన్లను, ఇంటర్నెట్, మొబైల్ సిగ్నల్ ను కేంద్రప్రభుత్వం కట్ చేయాల్సొచ్చిందంటే పరిస్ధితి ఎంత చేయిదాటిపోయిందో అర్ధమవుతోంది.

ఈ మొత్తం ఘటనల్లో పోలీసులదే తప్పుందని అనుకున్నా ఎర్రకోటపైకి రైతులు దాడి చేయటం, రైతుసంఘాల జెండాను ఎగరేయటం ముమ్మాటికి తప్పే. రెండు నెలలుగా ప్రశాంతంగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని దేశం యావత్తు మద్దతుగా నిలిచింది. కానీ చివరిరోజున ఢిల్లీ రోడ్లలో రైతులే అలజడి సృష్టించటంతో బాగా చెడ్డపేరు వచ్చేసింది. విధ్వంసం విద్రోహుల చర్యే అని సింపుల్ గా ఓ ప్రకటన ఇచ్చేస్తే సరిపోదు. ఎందుకంటే వచ్చిన చెడ్డపేరు ఎప్పటికీ పోదు.