చిన్న తప్పు చేసినా… వీసా కట్!

ఎన్నో కలలు కంటూ అమెరికాకు వెళ్లే భారత విద్యార్థులకు ఇప్పుడు పరిస్థితులు కలవరపెడుతున్నాయి. అమెరికాలో వీసా నియమాలు కఠినతరం కావడం, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, ఖర్చులు ఆకాశాన్ని తాకడం వంటి అంశాలు అక్కడ చదువుతున్న విద్యార్థుల్లో భయాన్ని రేకెత్తిస్తున్నాయి. ట్రంప్ పాలనలో వచ్చిన మార్పులు, నిబంధనల కఠినతనం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా అభివర్ణించబడుతోంది.

చిన్న తప్పులకు వీసా రద్దు చేయడం అక్కడ సాధారణమవుతోంది. ట్రాఫిక్ రూల్ ఉల్లంఘనలకైనా, సోషల్ మీడియాలో పెట్టిన అభిప్రాయాలకైనా విద్యార్థులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్నారు. “మా స్నేహితుడు కేవలం ఓ ట్రాఫిక్ తప్పిదం వల్ల వీసా కోల్పోయాడు. వెంటనే ఇండియా వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడే భయంతో జీవించాల్సి వస్తోంది,” అని ఓ విద్యార్థి వాపోతున్నాడు. ఈ తరహా ఉదంతాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు.

ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో చదువుకోవడం ఎంతో ఖరీదైన వ్యవహారం. ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఖర్చులు, బస్సు ప్రయాణాలు, ఆహారం.. అన్నింటికీ ఖర్చు పెరిగిపోయింది. ఇక డాలర్ విలువ పెరిగిన నేపథ్యంలో విద్యార్థుల కుటుంబాలపై ఆర్ధిక భారమూ భారీగా పడుతోంది. దీంతో చాలా మంది విద్యార్థులు రెండో, మూడో సంవత్సరంలోనే కోర్సులు మానేస్తున్నారు.

అంతే కాకుండా, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం దొరకడం చాలా కష్టం అయిపోయింది. కంపెనీలు విదేశీయులను నియమించడంపై వెనకడుతున్నాయి. వర్క్ వీసా పొందడంలో కూడా కఠినతరం వచ్చింది. పలు కంపెనీలు హెచ్-1బీ వీసాలకు దరఖాస్తు చేయడాన్ని తగ్గించాయి. దీంతో ఉద్యోగ అవకాశాలపై పూర్తిగా నీరెత్తినట్లయింది. ఈ పరిస్థితుల్లో భారత విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నారు. విదేశాల్లో ఉన్న తమ భవిష్యత్‌ను సురక్షితంగా చూడాలంటే విద్యార్థుల పట్ల అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపి, మద్దతు చూపాలని కోరుతున్నారు. మరి భారత విద్యార్థుల విషయంలో కేంద్రం ఏమైనా ఆలోచిస్తుందో లేదో చూడాలి.