టిల్లు సిరీస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న సినిమాగా జాక్ మీద ఈపాటికి భారీ అంచనాలు నెలకొనాలి. అయితే బయట అంత ఫీవర్ కనిపించడం లేదు. బుక్ మై షోలో టికెట్ల అమ్మకాలు ట్రెండింగ్ లోకి రాలేదు. పూర్తి స్థాయిలో అన్ని సెంటర్స్ ఓపెన్ కాలేదు కాబట్టి అప్పుడే కంక్లూజన్ కు రాలేం కానీ ఏదో మిస్ అవుతోందనే అనుమానం ఫ్యాన్స్ లో లేకపోలేదు. దానికి కారణమేంటో చూద్దాం. జాక్ ట్రైలర్ బాగానే ఉంది. ఓ రెండు బూతు పదాలు తప్పిస్తే ఫిర్యాదు చేసేంత బ్యాడ్ కంటెంట్ లేదు. సిద్దు మార్కు కామెడీ డైలాగులు పెట్టిన బొమ్మరిల్లు భాస్కర్ ఈసారి యాక్షన్ ఎపిసోడ్లు జొప్పించాడు. వాటిలో కూడా ఫన్ ఉంది.
సమస్య ఎక్కడంటే పాకిస్థాన్ తీవ్రవాదులను పట్టుకునే ఇన్వెస్టిగేటివ్ టీమ్ నేపధ్యాన్ని తీసుకోవడం మాస్ కి త్వరగా రీచ్ కావడం లేదు. ఎందుకంటే ఈ పాయింట్ ని సీరియస్ గా చెప్పిన ఎందరో దర్శకులు దాన్ని డ్రై చేశారు. కానీ భాస్కర్ వెరైటీగా దానికి ఎంటర్ టైన్మెంట్ జోడించడమే జాక్ ని కొత్తగా మార్చింది. డీజే టిల్లులో నేహా శెట్టి, టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ పరంగా వాటికి ప్లస్ అయ్యారు. కానీ జాక్ లో వైష్ణవి చైతన్యని హోమ్లీగా ప్రెజెంట్ చేశారు. సో యూత్ లో తను వేగంగా రిజిస్టర్ కాలేకపోతోంది. తనకు సంబంధించిన ట్విస్టులు కొత్తగా ఉంటాయని చెప్పడం చూస్తే ఏదో దాచారేమో.
పబ్లిసిటీ పరంగా జాక్ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటోంది. అయితే సిద్దు మార్కు వైరల్ ప్రమోషన్లు ఏమైనా జరిగితే బాగుండేదనేది అభిమానుల అభిప్రాయం. ఇందులో నిజం లేకపోలేదు. సంక్రాంతికి వస్తున్నాంకి అనిల్ రావిపూడి చూపించిన ఫార్ములాని ఇంకో రకంగా వాడితే బాగుండేది. జాక్ కు కలిగిన మరో మైనస్ పబ్లిక్ లో వేగంగా వెళ్లే పాట లేకపోవడం. రీల్స్, ట్వీట్స్ ఎక్కడ చూసినా మారుమ్రోగిపోయేలా ఒక సాంగ్ పడాలి. పాటలు బాగున్నాయనే ఫీడ్ బ్యాక్ ఉంది కానీ పేలిపోయేలా లేకపోవడం కొంత లోటే. ఇవన్నీ దాటుకుని బ్లాక్ బస్టర్ సాధిస్తే సిద్దు మార్కెట్ ఇంకో రెండు మెట్లు పైకెక్కినట్టే.