మోడి జమిలి ఎన్నికల జపానికి కారణం ఇదేనా ?

దేశంలో జమిలి ఎన్నికలు జరగాలని నరేంద్రమోడి ప్రతిపాదించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడో మూలనపడిన జమిలి ఎన్నికలను మళ్ళీ ఎందుకని తెరపైకి తీసుకొచ్చారు ? ఎందుకంటే తాజాగా ఇండియాటుడే-కార్వీ సంస్ధలు నిర్వహించిన సర్వే సమాధానం చెబుతోంది. మూడ్ ఆఫ్ ది నేషన్ అనే విషయంలో జరిపిన సర్వేలో ఇప్పటికిప్పుడు కానీ ఎప్పుడు ఎన్నికలు జరిపినా కానీ మళ్ళీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని తేలింది. అంటేట సర్వేలో చెప్పింది చెప్పినట్లు ప్రతిసారి జరుగుతుందనే గ్యారెంటీలేదు.

సర్వేలన్నవి జననాడి ఎలాగుందనే విషయంలో కాస్త స్టడీ చేయటానికి పనికొస్తుంది. ఇక విషయానికి వస్తే పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని చెప్పిన సర్వేలే తొందరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎక్కడా బీజేపీ కానీ ఎన్డీయేకానీ అధికారంలోకి వస్తుందని చెప్పలేదు. తొందరలోనే పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి వస్తాయని తేల్చిచెప్పాయి.

తమిళనాడులో డీఎంకే, కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సర్వే చెప్పింది. అలాగే పశ్చిమబెంగాల్లో కూడా మమతా బెనర్జీయే మళ్ళీ అధికారంలోకి వస్తుందని సర్వేలో తేలింది. అస్సాంలో మాత్రం బీజేపీ స్వల్ప ఆధిక్యతతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పింది. సర్వే ప్రకారం మూడు రాష్ట్రాల్లో బీజేపీకి మైనస్సే అని తేలిపోయింది. అస్సాంలో మాత్రం అవకాశం ఉందని చెప్పిందే కానీ కచ్చితంగా వస్తుందనే గ్యారెంటీ ఇవ్వలేదు.

అంటే సర్వేల వల్ల ఏమి అర్ధమవుతోందంటే పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీయేకే జనాలు పట్టంకట్టినా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకే ఓటేస్తున్నారని. ఈ పద్దతినే మోడి తట్టుకోలేకపోతున్నట్లు అర్ధమైపోతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నంత మాత్రానా రాష్ట్రాల్లో అంతా బాగున్నట్లు కాదు కదా. ఈ పద్దతిపోయి రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి రావాలంటే జమిలి ఎన్నికలు ఒకటే మార్గమని మోడి అనుకున్నట్లున్నారు.

అంటే పార్లమెంటుకు ఎన్డీయేకి ఓట్లేసే జనాలు ఆటోమేటిగ్గా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి లేదా ఎన్డీయేకే ఓట్లేస్తారని అనుకున్నట్లున్నారు. మరి మొన్నటి ఏపి ఎన్నికల్లో పార్లమెంటు+అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. పార్లమెంటుకు అసెంబ్లీకి ఎక్కడా బీజేపీకి జనాలు ఓట్లేయలేదన్న విషయం మరచిపోకూడదు. ఏదేమైనా మోడి వ్యూహం ప్రకారం కేంద్ర+అసెంబ్లీలకు ఒకేసారి అంటే జమిలి ఎన్నికలు జరిగితేనే బీజేపీకి రెండు విధాల లాభమని అనుకున్నట్లున్నారు. అందుకనే జమిలి ఎన్నికల ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు.