ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా పరిస్థితులు మారుతున్నాయి. ఒకప్పుడు బలంగా ఉన్న నెల్లూరు, శ్రీకాకుళం, కడప వంటి కీలక జిల్లాల్లో ముఖ్యనేతల మధ్య వివాదాలు.. విమర్శలు జోరుగా సాగుతున్నాయి. దీనికి తోడు కొందరు నేతలు ఇప్పటికే పార్టీని వీడటంతో పరిస్థితి తీవ్రంగానే ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలు రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి.
రేపల్లె నియోజకవర్గంలో మోపిదేవి శ్రీనివాసరావు సస్పెన్షన్ ఇప్పుడు తీవ్రంగా కుదిపేస్తోంది. రేపల్లె నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావును పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో వైసీపీ అధిష్టానం పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఇది బాపట్ల, ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఆ సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అంతేకాదు.. పార్టీలో కనీసం ఆయన గురించి చర్చించలేదని కూడా అంటున్నారు. ఏమాత్రం వివరణ తీసుకోలేదని తెలుస్తోంది.
మరోవైపు తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉత్తరాంధ్ర, కాకినాడ జిల్లాల్లో నాయకులు వలసల బాట పడుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో కీలక వ్యూహకర్తగా ఉన్న మజ్జి శ్రీను ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు. అలాగే కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ పరిశీలకుడు నెక్కంటి సాయిప్రసాద్ కూడా వైసీపీని వీడారు. ఉత్తరాంధ్రలో పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. అంతర్గత కలహాలు పెరుగుతున్నాయి. తాజాగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు.. తమ్మినేని చిరంజీవి నాగ్.. వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదని చేసిన వ్యాఖ్య.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని డోలాయమానంలో పడేసింది.
ఇక, గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య సమన్వయం లోపించింది. జగన్ నిర్ణయాలపై కొందరు నేతలు అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఎత్తుకున్న మావిగన్ అంశం.. ఇదే ఎన్నికల్లో అజెండా కూడా అవుతుందని పేర్కొనడం వంటివి నాయకులకు రుచించడం లేదు. ఇదిలావుంటే.. స్థానిక ఎన్నికల సవాల్ కూడా వైసీపీకి ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలో కూటమి పార్టీలు.. క్లీన్ స్వీప్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి.
రాబోయే మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో వైసీపీని పూర్తిగా నిలువరించడమే లక్ష్యంగా అధికార కూటమి వ్యూహాలు రచిస్తోంది. దీంతో అటు వలసలు, నాయకులు ఇస్తున్న షాక్ల మధ్య వైసీపీ భారీ పతనావస్థకు చేరుకుంటోందని అంటున్నారు. తాజాగా కీలక నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా పార్టీ మారే అవకాశం ఉందని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదే జరిగితే.. ఉత్తరాంధ్రలో వైసీపీకి భారీ దెబ్బతగలడం ఖాయమని చెబుతున్నారు. మొత్తంగా సార్వత్రిక ఎన్నికలకు మూడు సంవత్సరాల ముందే.. వైసీపీ డీలాపడుతున్న సంకేతాలు వస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates