యువతను ముఖ్యమంత్రిని చేస్తామని, రెడ్లేతర సామాజిక వర్గానికి సీఎం సీటు అప్పగిస్తామని చెబుతున్నా..మాజీ రాజ్యసభ సభ్యుడు.. ఒకప్పటి వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి మాటలను పెద్దగా ఎవరూ విశ్వసించడం లేదు. ఆయనను అటు బీజేపీకి కానీ.. ఇటు జగన్కు కానీ.. ‘టీం బీ’గానే భావిస్తున్నట్టు తెలుస్తోంది. నిన్నమొన్నటి వరకు వైసీపీతో అంటకాగిన సాయిరెడ్డికి.. బీజేపీ తోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆయనే చెబుతున్నారు.
దీంతో సాయిరెడ్డిని నమ్మేదెలా ? అనేది ప్రధాన సమస్య. ముఖ్యంగా ముఖ్యమంత్రిపీఠం వేరే సామాజిక వర్గానికి యువతకు ఇచ్చేస్తానని ఆయన చెబుతున్న మాటలు.. గతంలో ఓ నాయకుడు చేసిన వ్యాఖ్యల కు భిన్నంగా ఏమీ లేవని కూడా అంటున్నారు. పైగా.. సాయిరెడ్డికి కలిసి వచ్చే జనాలు కానీ..ఓటు బ్యాంకు కానీ.. ప్రత్యేకంగా లేవని కూడా చెబుతున్నారు. ఈ విషయంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది.
ఇక, తాజాగా అనంతపురంలో మాట్లాడిన సాయిరెడ్డి మరోసారి తన మనసులో మాట ఇదీ.. అంటూ.. తాము అధికారంలోకి వస్తే.. యువతకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తామన్నారు. మరోసారి వైసీపీ వస్తే.. జగనే ముఖ్యమంత్రి అవుతాడని, ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే.. లోకేష్ సీఎం అవుతారని చెప్పుకొచ్చారు. కానీ, ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా తాము మాత్రం అధికారంలోకి వస్తే.. సీఎం సీటును యువతకు ఇచ్చేస్తామని చెప్పుకొచ్చారు.
విశ్వసనీయత విషయంలో సాయిరెడ్డికి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. ఆయన కుమార్తె, అల్లుడి పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా విశాఖలో భీమిలి తీరం వెంబడి.. ఆయన కుమార్తె పెద్ద రిసార్టు పనులు ప్రారంభించారు. హైకోర్టు జోక్యంతో దానిని తీసేయాల్సి వచ్చింది. ఇక, ఆయనపైనా మద్యం స్కామ్ మరకలు ఉండనే ఉన్నాయి. ఇవన్నీ.. వదిలేసి.. రాజకీయాల్లో తాను సచ్ఛీలుడిని అని చెప్పుకొనే ప్రయత్నం కూడా ప్రజల్లో పెద్దగా వర్కవుట్ కావడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. అయితే.. రాజకీయంగా ఆయన పార్టీ పెట్టుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేకపోయినా.. ఆయన ఎవరి ‘పక్షం’ అనేదే ఇప్పుడు పొలిటికల్గా చర్చనీయాంశం అయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates