మంత్రి లోకేష్ వ్యాఖ్య‌లు.. విజ్ఞ‌ప్తా.. ఆదేశ‌మా?!

ఏపీ మంత్రి నారా లోకేష్.. తాజాగా సోష‌ల్ మీడియాలో చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయం దుమారానికి దారి తీశాయి. ఈ వ్య‌వ‌హారంపై సీనియ‌ర్ ఐఏఎస్ ఒక‌రు స్పందించ‌డం.. ఆ వెంట‌నే వైసీపీ నాయ‌కులు కూడా దీనిని వివాదం చేయ‌డం గ‌మ‌నార్హం. దీంతో మ‌రో మంత్రి మండ‌ప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి స్పందిస్తూ.. లోకేష్ చేసిన వ్యాఖ్య‌లు కేవ‌లం విజ్ఞ‌ప్తి మాత్ర‌మేన‌ని.. ఆ వ్యాఖ్య‌ల‌ను రాజ‌కీయం చేయ‌డం.. విమ‌ర్శ‌లు గుప్పించడం స‌రికాద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు.

అస‌లేంటి విష‌యం..?

గ‌త సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఐదు రోజుల అనంత‌రం.. శ‌నివారం నుంచి నిమ‌జ్జన ఘ‌ట్టాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో యువ‌త ఏర్పాటు చేసిన పందిళ్ల నుంచి నిమజ్జ‌నం వ‌ర‌కు వినాయ‌క విగ్ర‌హాల‌ను ఊరేగింపుగా తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ‘డీజే’కు అనుమ‌తి కోరుతూ.. పోలీసుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. అయితే.. డీజేకు ఎలాంటి అనుమ‌తులు లేవ‌ని.. అలాంటి ఏర్పాట్లు చేసేవారిపై క్రిమిన‌ల్ కేసులు పెడ‌తామ‌ని ఎస్పీలు ఆదేశించారు. ఇది యువ‌త‌ను నిరుత్సాహ ప‌రిచింది.

ఈ క్ర‌మంలో మంత్రి నారా లోకేష్‌కు యువ‌త పెద్ద ఎత్తున విజ్ఞ‌ప్తులు ఇచ్చారు. డీజేకి అనుమ‌తి ఇచ్చేలా చూడాల‌ని కోరారు. దీంతో స్పందించిన నారా లోకేష్. గణేష్‌ నిమర్జనంలో డీజే వాహనాలకు అనుమతులు ఇవ్వాల‌ని కోరుతూ.. హోంమంత్రి అనిత‌, డీజీపీ గుప్తాల‌కు విజ్ఞప్తి చేశారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ మేర‌కు పోస్టు చేశారు. గణేష్‌ నిమర్జనం సందర్భంగా డీజే వాహనాలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదంటూ తనకు సందేశాలు వస్తున్నాయని తెలిపారు.

హోంమంత్రి అనిత, డీజీపీ జోక్యం చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు మంజూరు చేయాలని.. ఒక్క డీజే వాహనం కూడా సీజ్‌ చేయకూడదని పోలీసు శాఖకు లోకేష్ విజ్ఞప్తి చేశారు. అంతేకాదు.. గణేష్‌ నిమర్జన కార్యక్రమాల నేపథ్యంలో అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని కోరారు. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి పీవీఎస్ శ‌ర్మ స్పందిస్తూ.. ” లోకేష్ మీరు ఇంకా సీఎం కాలేదు సీఎం కుమారులైనంత మాత్రాన, మరొక మంత్రిని ఒక పనిచేయొద్దని ఆదేశించే అధికారం మీకు లేదు ప్రొటోకాల్, ప్రజాస్వామ్య మర్యాదలు ఉల్లంఘించొద్దు.” అని పోస్టు చేశారు.

ఈ వ్య‌వ‌హారంపై వైసీపీ నాయ‌కులు కూడా ఘాటుగా స్పందించారు. త‌న‌కు సంబంధం లేని శాఖ‌పై లోకేష్ పెత్త‌నం చేస్తున్నార‌ని ప‌లువురు నేత‌లు ఆక్షేపించారు. దీంతో మ‌రో మంత్రి మండ‌ప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. లోకేష్ చేసింది విజ్ఞ‌ప్తి మాత్ర‌మేనని.. మంత్రిగా ఆయ‌న‌కు వ‌చ్చిన విజ్ఞ‌ప్తుల‌ను ప‌రిశీలించాల‌ని కోర‌డం.. విజ్ఞ‌ప్తి చేయ‌డం త‌ప్పుకాద‌న్నారు. దీనిని భ‌క్తి కోణంలోనే చూడాల‌ని.. వివాదం చేయొద్ద‌ని కోరారు.