ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా తెలియజేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. తమతీర్పు ప్రతులను కూడా తక్షణం వారికి పంపించాలని ఆదేశించడం గమనార్హం. ఈ అనర్హత 2024లో ఆయన ఎంపీగా పోటీ చేసిన నాటి నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అంతేకాదు.. తక్షణమే ఆయనకు జీత భత్యాలు వంటివి నిలుపుదల చేయాలని అసెంబ్లీ సెక్రటేరియట్ను ఆదేశించడం గమనార్హం. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసి.. తదుపరి ఏడాది కూడా తిరగకుండా.. కాంగ్రెస్ టికెట్పై ఆయన ఎంపీగా పోటీ చేయడాన్ని దాచిపెట్టలేరని.. దానం తరఫు న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏం జరిగింది?
2023లో దానం నాగేందర్.. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. అనంతరం.. పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వదిలి.. కాంగ్రెస్లో చేరారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. దీనిపై వారు అటు అసెంబ్లీలోను… ఇటు న్యాయపరంగానూ పోరాటం చేశారు. అయితే.. తాము పార్టీ మారలేదంటూ.. సదరు ఎమ్మెల్యేలు చెప్పుకొన్నారు. కానీ, దానం విషయానికి వస్తే.. ఆయన 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై ఎంపీగా పోటీ చేశారు. ఇక్కడే ఆయన దొరికి పోయారు. ఇలా జాతీయ పార్టీ తరఫున పోటీ చేయాలంటే.. ప్రాథమిక పార్టీ సభ్యత్వం ఉండాలన్న వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఈ వ్యవహారంపై హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. స్పీకర్ ప్రసాద్ కుమార్.. పలు మార్లు విచారణ జరిపారు. అయితే.. ఆయన వీరెవరూ పార్టీ మారలేదని స్పష్టం చేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే విషయాన్ని హైకోర్టుకు చెప్పారు. తాజాగా బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన కోర్టు.. దానం నాగేందర్ పార్టీ మారాడనడానికి సాక్ష్యాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. పార్టీ ఫిరాయింపుల చట్టం మేరకు ఆయనపై చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. స్పీకర్ నిర్ణయం కూడా సరిగా లేదని.. ఆయన కొన్ని అంశాలను వదిలేశారని స్పష్టం చేస్తూ.. దానం ఎన్నికను రద్దు చేసింది. ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్టు తీర్పు వెలువరించింది.
దానం దొరికిపోయింది ఇలా..
- పార్టీ మారలేదని దానం చెబుతున్నా.. ఆయన ప్రాథమిక సభ్యత్వం బీఆర్ఎస్లో రద్దయింది.
- కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడం.. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం నిర్ణయం.
- ఒక పార్టీ తరఫున పార్లమెంటుకు పోటీ చేయడం అంటే.. ఆ పార్టీ సభ్యత్వం ఉండాలి.
- ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉందని కౌన్సిల్ నిరూపించింది.
- ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. దానంపై వేటు వేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates