వ్యాక్సిన్‌.. 30 కోట్ల మందికి.. బాదుడు.. 130 కోట్ల మందికి.. ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌

క‌రోనా వ్యాక్సిన్ పంపిణీకి దేశం సిద్ధ‌మైంది. కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ల‌ను ద‌శ‌ల‌వారీగా అందించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం బాగానే కృషి చేసింది. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక మందికి… అందునా అత్యంత వేగంగా క‌రోనా టీకా అందిస్తున్న దేశంగా ఇప్ప‌టికే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నుంచి ద్ర‌వ్య నిధి సంస్థ వ‌ర‌కు భార‌త్ పై ప్రశంస‌ల జ‌ల్లు కురుస్తోంది. తొలి ద‌శ శ‌నివారం దేశ‌వ్యాప్తంగా ప్రారంభం కానుంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్నారు. దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. అయితే.. తొలుత క‌రోనా వారియ‌ర్స్‌గా ఉన్న హెల్త్ కేర్ వ‌ర్క‌ర్ల‌కు వ్యాక్సిన్ ఇవ్వ‌నున్నారు. ఆ త‌ర్వాత ద‌శ‌ల వారీగా వ‌చ్చే రెండేళ్ల‌లో మొత్తం 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుంది.

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ చేస్తున్న ఈ ప్ర‌య‌త్నానికి ప్ర‌పంచ దేశాల నుంచి ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. బీజేపీ సానుకూల పార్టీల నుంచి కూడా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఇక‌, ప్ర‌తిప‌క్షాలు ఏమీ మాట్లాడ‌కుండా మౌనంగా ఉన్నాయి. ఇంత వ‌ర‌కు కేంద్రం చేస్తున్న దానిని అంద‌రూ కొనియాడుతున్నారు.కానీ, చాప‌కింద నీరులా.. మోడీ టీకా పేరుతో ప్ర‌జ‌ల‌పై భారీ ఆర్థిక భారం మోప‌నున్నార‌నే స‌మాచారం ఢిల్లీ వ‌ర్గాల్లో లీకైంది. ప్ర‌స్తుతం టీకా.. ఇస్తున్న నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం వెల్ల‌డించ‌లేదు. ఇటు టీకా.. అటు బాదుడు విష‌యాల‌ను ఒకే సారి చెబితే.. టీకా వ‌ల్ల పొందాల్సిన ల‌బ్ధి పోతుంద‌నే ఆలోచ‌న చేస్తున్న‌ట్టుగా ఉంది. అయితే.. ఆర్థిక శాఖ వ‌ర్గాల నుంచి మాత్రం విష‌యం లీకైంది.

వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రి 1న కేంద్రం 2021-22 వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌నుంది. ఈ క్ర‌మంలో బాదుడు ప‌ర్వానికి తెర‌దీయ‌నుంద‌నే ప్ర‌చారం ఢిల్లీలో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా క‌రోనా వ్యాక్సిన్ సెస్‌ను బ‌డ్జెట్‌లో పేర్కొంటున్నార‌ని తెలుస్తోంది. త‌ద్వారా.. అన్ని వ‌స్తువుల‌పైనా.. సెస్‌ను విధించేందుకు మోడీ స‌ర్కారు రెడీ అయింది. గ‌తంలో స్వ‌చ్ఛ‌భార‌త్ సెస్(ఇంకా కొన‌సాగుతోంది) ‌ను విధించిన‌ట్టుగానే ఇప్పుడు క‌రోనా వ్యాక్సిన్‌పై కూడా సెస్ విధించాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. అయితే.. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర ఆరోగ్య శాఖ వ‌ర్గాల అధికారిక స‌మాచారం మేర‌కు దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు టీకా ఇచ్చేందుకు క‌నీసం రెండు సంవ‌త్సరాలు ప‌డుతుంది.

ఇక‌, ఈఏడాది చివ‌రినాటికి క‌రోనా వారియ‌ర్స్‌కు మాత్ర‌మే విడ‌త‌ల వారీగా వ్యాక్సిన్ ఇవ్వ‌నున్నారు. అంటే.. ప్ర‌భుత్వం వ‌ద్ద ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న గ‌ణాంకాల మేర‌కు మొత్తం 30 కోట్ల మందికి రెండేళ్ల‌లో(వ్యాక్సిన్ ఉత్ప‌త్తి ఎంత పెంచినా..) వ్యాక్సిన్ ఇవ్వ‌నున్నారు. కానీ, వ‌చ్చే నెల‌లో ప్ర‌వేశ పెట్ట‌నున్న బ‌డ్జెట్లో క‌రోనా వ్యాక్సిన్ సెస్‌ను ప్ర‌వేశ పెడితే.. మాత్రం 130 కోట్ల మంది భార‌త ప్ర‌జ‌ల‌పై ప‌న్నుల రూపంలో బాదుడు ప్రారంభం కానుంది. ఈ విష‌యం తెలిసిన వాణిజ్య వ‌ర్గాలు.. ద‌టీజ్ మోడీ అంటూ కామెంట్లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.