ఇక ఆర్టీసీలో మహిళా డ్రైవర్లు

ఆర్టీసీలో త్వరలో మహిళా డ్రైవర్లను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఆర్టీసీలో మహిళా కండక్టర్లను నియమించిన ఘనత దేశంలో తెలుగు దేశం ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని అన్నీ ఆర్టీసీ డిపోలకు ఎలక్ట్రానిక్ బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు ఆ బస్సులను మహిళలు నడపాలని చెప్పారు. త్వరలో ఏసీ బస్సులు వస్తున్నాయని, మహిళలు ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో మంగళవారం ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా రాష్ట్రాభివృద్ధికి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. మూస రాజకీయాలు, పరిపాలనకు భిన్నంగా ప్రజలకు ఏమి కావాలో వారినే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడం పట్ల సానుకుల స్పందన వ్యక్తం అవుతుంది.

మొగల్తూరులో చంద్రబాబు తన మనసులో మాటను ప్రజలతో స్పష్టంగా పంచుకున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడికక్కడే నిలిచిపోయిందని, రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి పట్టాలెక్కించడానికి ఇంత సమయం పట్టిందన్నారు.

డీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా అడ్డుకునేందుకు 350 కేసులు వేసినట్లు గుర్తు చేశారు. అయినా వెనకంజ వేయకుండా పరీక్షలు నిర్వహించి, నియామకాలు పూర్తి చేశామని తెలిపారు. దాన్ని జీర్ణించుకోలేక డీఎస్సీలో అక్రమాలు జరిగాయని కొత్త రాగం అందుకున్నారని, దాన్ని డీఎస్సీ ఉద్యోగులే వ్యతిరేకస్తున్నారని చెప్పారు.

సంక్షేమం పేద ప్రజలను నిలబెట్టాలని, తాత్కాలికంగా ఉపశమనం కలిగించాలని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక 75, 503 కోట్ల రూపాయలు పింఛన్లు ఇచ్చామని, ఈ డబ్బులతో మూడు పోలవరం ప్రాజెక్టులు నిర్మించవచ్చన్నారు. అయినప్పటికీ పేదలకు అండగా నిలబడాలని పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో 9 సార్లు విధ్యుత్ చార్జీలు పెంచినట్లు ఆరోపించిన చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా కరెంటు చార్జీలు పెంచలేదని చెప్పారు.