బెంగాల్ రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు

Mamata
Mamata Banerjee addressing a rally in Kolkata on the occasion of the TMCP foundation day | Salil Bera

ప‌శ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘ‌కాలం పాటు పాల‌న సాగించిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప‌రాజ‌యం పాలైన విష‌యం తెలిసిందే. దీంతో అప్ర‌తిహ‌తంగా 15 ఏళ్ల‌పాటు రాష్ట్రాన్ని పాలించిన మ‌మ‌తాబెన‌ర్జీ త‌ప్పుకొన్నారు. అంతేకాదు.. ఆమె ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం కూడా తెలిసిందే. ఈ క్ర‌మంలోనే బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. క‌మ‌లం ప‌గ్గాలు చేప‌ట్టాక‌.. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ముక్క‌లు చెక్క‌లుగా మారింది. అటు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఇటు పార్ల‌మెంటు ఎంపీలు కూడా చీలిపోయారు. అంతేకాదు.. అస‌లు తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ త‌మ‌దేనంటూ.. కొంద‌రు ఎన్నిక‌ల సంఘానికి లేఖ కూడా స‌మ‌ర్పించారు.

ఇక‌.. అనంత‌ర ప‌రిణామాలు.. మ‌రింత హాట్ టాపిక్‌గా మారాయి. మ‌మ‌తా బెన‌ర్జీ అంటే.. ఒక‌ప్పుడు విన‌య‌విధేయ‌త‌లు చూపించిన నాయ‌కులు త‌ర్వాత కాలంలో ఆమెను ఎదిరించారు. క‌ట్ చేస్తే.. అస‌లు పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్ క‌ష్టాల్లో చిక్కుకుంది. దీంతో తాజాగా.. ఆ పార్టీ పేరును, గుర్తును(గ‌డ్డి పూలు) ఎవ‌రికీ కేటాయించేది లేద‌ని ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. అంతేకాదు.. మ‌మ‌తా బెన‌ర్జీ వ‌ర్గానికి చెందిన పార్టీకి మ‌మ‌త ఆల్ ఇండియా తృణ‌మూల్ కాంగ్రెస్‌ పేరును కేటాయించింది. అలానే.. ఫుట్ బాల్ ప్లేయ‌ర్‌ను ఎన్నికల గుర్తుగా పేర్కొంది. ఇక‌, ఈమెతో విభేదించి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారికి డెమొక్ర‌టిక్ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ పేరు నిర్ధారించింది. గుర్తును మాత్రం కేటాయించింది.

చిత్ర విచిత్రాలు..

మ‌రోవైపు.. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో అక్టోబ‌రు 6న అసెంబ్లీ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించిన నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా ప్రారంభ‌మైంది. అయితే.. మ‌మ‌తా బెన‌ర్జీ టికెట్ స‌హా.. బీఫారం ఇచ్చిన నాయ‌కుడు తాజాగా యూట‌ర్న్ తీసుకున్నారు. నందిగ్రామ్ ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించి మ‌మ‌తా బెన‌ర్జీ.. సంచితా ప్ర‌ధాన్ అనే నాయ‌కుడిని ఎంపిక చేశారు. ఆయ‌న బీఫాం ఇచ్చారు. గ‌త వారం రోజులుగా ప్ర‌చారం కూడా చేస్తున్నారు. కానీ, తాజాగా శుక్ర‌వారం ఉద‌యం ఆయ‌న .. సీఎం, బీజేపీ నేత సువేందు అధికారితో భేటీ అయ్యారు. అంతే.. ఒక్క‌సారిగా ఆయ‌న యూట‌ర్న్ తీసుకున్నారు. తాను మ‌మ‌త పార్టీకి రిజైన్ చేస్తున్నాన‌ని.. బీజేపీలో చేరిపోతున్నాన‌ని చెప్పారు.

ఇక్క‌డే మ‌మ‌త వెంట‌నే నిర్ణ‌యం మార్చుకున్నారు. ఇదే నందిగ్రామ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థికి తాము మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఆమె అలా ప్ర‌క‌ట‌న చేశారో.. లేదో.. వెంట‌నే పోలీసులు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున నందిగ్రామ్ ఉప ఎన్నిక‌లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకుని.. నామినేష‌న్ కూడా వేసిన‌.. మిలాన్ ప్ర‌ధాన్‌ను శుక్ర‌వారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఎప్పుడో 2007లో ఆయ‌న‌పై భూ క‌బ్జా కేసు పెండింగులో ఉంద‌ని పేర్కొన్నారు. దీంతో ఆయ‌న నామినేష‌న్ ఏమేర‌కు చెల్లుబాటు అవుతుంద‌ని ప్ర‌శ్న‌. మొత్తంగా.. ఉప ఎన్నిక కూడా.. ప‌శ్చిమ బెంగాల్‌లో ర‌స‌వ‌త్త‌రంగా మార‌డం.. చిత్ర విచిత్ర రాజ‌కీయాల‌కు కేంద్రంగా మార‌డం గ‌మ‌నార్హం.