సీఎం రేవంత్ టీంకు ఢిల్లీ నుంచి పిలుపు

అంతా ఊహించినట్టే ఢిల్లీ కాంగ్రెస్ స్పందించింది. ఇన్నాళ్లు తెలంగాణా కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను మౌనంగా గమనిస్తూ వచ్చిన అధిష్టానం ఎట్టకేలకు జోక్యం చేసుకుంది. ఇకనైనా నాయకులను గాడిలో పెట్టక పోతే దాని ప్రభావం ప్రభుత్వం మీద ఉంటుందని, చేజేతులా దక్షిణాదిలోని అత్యంత కీలకమైన తెలంగాణాను చేజార్చుకున్నట్లవుతుంది అధినాయకత్వం అవగతం చేసుకుంది. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దానికి నాలుగు రోజుల ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ లను ఢిల్లీకి రావాల్సిందిగా కబురు పంపింది. కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీకి చేరింది.

అయితే ఢిల్లీలో ఏమి జరగబోతుందని కాంగ్రెస్ నాయకులలో చర్చ మొదలైంది. ఎవరెవరి మీద వేటు వేస్తారు, ఎరెవరికి ఓటు వేస్తారు అని మల్లగుల్లాలు పడుతున్నారు. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మంత్రి కొండా సురేఖ మీద వేటు పడటం మాత్రం ఖాయమని బలంగా ప్రచారం జరుగుతుంది. చిన్నా రెడ్డిని ఇంటికి పంపిస్తారని చెబుతున్నారు. పనిలో పనిగా మరికొందరికి కూడా షాక్ తప్పదని ప్రచారం జరుగుతుంది. దాంతో ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు మునిపోయారు. కొందరు ఆశావాహులు మంత్రి వర్గంలో స్థానం కోసం ప్రయత్నం చేస్తుంటే, పదవికి ఎసరు వస్తుందని భావిస్తున్న వారు తమ కుర్చీ కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఢిల్లీ పెద్దలు మాత్రం ప్రక్షాళన దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. కొండా సురేఖ స్థానంలో ఆది శ్రీనివాస్ ను తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటినుంచి ఆలోచిస్తున్నారు. అధిష్టానం ఆయన ఆలోచనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదోనని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సురేఖ స్థానంలో ఎమ్మెల్సీ విజయశాంతికి అవకాశం కల్పించాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్సీ ఇచ్చే సమయంలోనే ఆమెకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. సోనియా గాంధీ కూడా ఆమెకు మాట ఇచ్చినట్లు చెప్పుకున్నారు. మహిళా కోటాలో సీనియర్ నాయకుడు కేకే కూతురు విజయలక్ష్మి పేరు కూడా వినిపిస్తుంది.

పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కు కూడా మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం వుందని మరో ప్రచారం జరుగుతుంది. స్పీకర్ ప్రసాద కుమార్ కూడా మంత్రి పదవికి ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఆయనకు ఢిల్లీ పెద్దల ఆశీస్సులున్నట్లు చెప్పుకుంటున్నారు. వారి స్థానంలో దళిత సామాజిక వర్గానికి చెందిన వారికి స్పీకర్ పదవి, బీసీ నాయకుడికి పీసీసీ ఇచ్చి గౌరవించాలని అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎస్సీ, బీసీలకు తగిన ప్రాధాన్యత ఎప్పటికి కొనసాగుతుందన్న సంకేతాలు ఇవ్వాలన్న వ్యూహంతో వుంది.

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం తేనేతుట్టేను కదిలిస్తున్నట్టే కనిపిస్తుంది. ఏక కాలంలో అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. తద్వారా ఎంతటి వారైనా గీత దాటితే క్షమించేది లేదని వార్నింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒకవైపు హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలు, మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, మంత్రులు బాధ్యత లేకుండా వ్యవహరించడం పట్ల ఢిల్లీ పెద్దలు ఆగ్రహంగా వున్నట్లు చెబుతున్నారు. సొంత ఎజెండా కోసం పార్టీని దెబ్బ తీసేందుకు సిద్ధమవుతున్న నాయకులను బయటకు పంపించడమే మేలని భావిస్తున్నారు.