వైసీపీ టాప్ లీడ‌ర్‌కు జ‌గ‌న్ చెక్‌…?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గ వైసీపీ రాజకీయంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుత వైసీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో ప్రసన్నకుమార్‌రెడ్డి తీరుపై వైఎస్ జగన్‌కు పలు ఫిర్యాదులు వెళ్లడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

నియోజకవర్గంలో బ‌లంగా పాతుకుపోయిన టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఢీకొట్టాలంటే ప్రసన్న సరైన నాయకుడు కాదని పార్టీ కేడర్ భావిస్తోంది. వాస్త‌వానికి జ‌గ‌న్ కాంగ్రెస్ పార్టీని వీడ‌క ముందే 2009 ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి గెలిచిన ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి వైఎస్సార్ ఉన్న‌ప్పుడే ఆయ‌న‌కు చేరువ అయ్యారు. అనంత‌రం వైసీపీలోకి వెళ్లి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వి వ‌దులుకుని 2012 ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యేగా ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి రికార్డు క్రియేట్ చేశారు.

2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఓడిన ఆయ‌న 2019లో గెలిచి మంత్రి ప‌ద‌వి ఆశించినా ద‌క్క‌లేదు. 2024 ఎన్నిక‌ల్లో వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి చేతిలో దారుణంగా ఓడిపోయారు. ఇక ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌శాంతి రెడ్డి బ‌లంగా ఉన్నారు. ప్ర‌స‌న్న ఊక‌దంపుడు విమ‌ర్శ‌లు చేయ‌డం త‌ప్ప నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్ష‌నేత‌గా నిర్మాణాత్మ‌క విమ‌ర్శ‌లు చేయ‌డం లేద‌ని.. ఆయ‌న వ‌ల్ల పార్టీకి ఉప‌యోగం లేద‌న్న నివేదిక‌లు అధిష్టానానికి వెళ్లాయంటున్నారు. దీనికి తోడు గ‌తంలో ఉన్నంత క్రేజ్ ఇప్పుడు ఆయ‌న‌కు లేద‌ని.. చివ‌ర‌కు సొంత పార్టీ నేత‌లే ఆయ‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నార‌ని టాక్ ?

ప్రస్తుతం కోవూరులో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవడంలో స్థానిక వైసీపీ నాయకత్వం విఫలమవుతోందని పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో బలమైన ఆర్థిక వనరులు, మంచి ఇమేజ్ ఉన్న కొత్త నాయకుడిని ఇన్‌చార్జ్‌గా నియమించాలని వైసీపీ చూస్తోంది. ప్రసన్నకుమార్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, ఆయనను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పించడమే బెటర్ అని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.