దారిన ప‌డుతున్న నేత‌లు… `వైసీపీకి నో ఛాన్స్‌!`

స్థానిక ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీల మ‌ధ్య చిరాకులు, ప‌రాకుల‌కు అవ‌కాశం ఉంటుంద‌ని.. త‌మ‌కు అది మేలు చేస్తుంద‌ని భావిస్తున్న వైసీపీకి కూట‌మి పార్టీలు చెక్ పెడుతున్నాయి. అంతర్గ‌త చ‌ర్చ‌ల్లో కూట‌మి నాయ‌కులు ఇదే విష‌యాన్ని పేర్కొంటున్నారు. మ‌న‌లో మ‌నం కీచులాడుకుంటే.. అది ప‌రోక్షంగా, ప్ర‌త్య‌క్షంగా కూడా వైసీపీకి మేలు చేస్తుంద‌ని కూట‌మి నాయ‌కులు చెబుతున్నారు. గ‌త రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్న రాజ‌మండ్రి ఎంపీ, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి బీజేపీ నేత‌ల‌కు ఇదే విష‌యాన్ని చెబుతున్నారు.

స్థానిక ఎన్నిక‌ల్లో క‌లిసి క‌ట్టుగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పురందేశ్వ‌రి వెల్ల‌డిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఎవ‌రిపై అయితే.. పోరాడామో.. ఏ స్ఫూర్తితో అయితే.. మూడు జెండాల‌ను(జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ) ప‌ట్టుకున్నామో.. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తిని చాటాల్సిన అవ‌స‌రం ఉంది. లేక‌పోతే.. అరాచ‌క శ‌క్తులు పేట్రేగుతాయి. ఈ విష‌యా న్ని కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కూడా గుర్తించాల్సి ఉంది. అని ఆమె చెబుతున్నారు. ఈ విష‌యాలు బీజేపీలో బ‌లంగా ప‌నిచేస్తున్నాయి. మ‌రోవైపు.. సోము వీర్రాజు కూడా.. సంఘాల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు.

ఇక‌, జ‌న‌సేన‌లో కూడా.. ఇదే త‌ర‌హా ప‌రిస్థితిక‌నిపిస్తోంది. పార్టీ ఇప్ప‌టికే 14 మందితో కూడిన క‌మిటీని ఏర్పాటు చేసింది. పార్టీ ప‌రంగా అనుస‌రించాల్సిన వ్యూహాల‌ను చ‌ర్చిస్తున్నారు. ఈ క‌మిటీని నిదాన‌స్తుడు, వివాద‌ర‌హితుడిగా పేరున్న అవ‌నిగ‌డ్డ ఎమ్మెల్యే మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్‌కు క‌న్వీన‌ర్‌గా నియ‌మించారు. ఆయ‌న కూడా .. పురందేశ్వ‌రి చెప్పిన విష‌యాన్నే చెబుతున్నారు. పార్టీపరంగా 2019-24 మ‌ధ్య ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డామోగుర్తు చేసుకోవాల‌ని ఆయ‌న చెబుతున్నారు.

ఐక్యంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మండ‌లి హిత‌వు ప‌లుకుతున్నారు. ఫ‌లితంగా స్థానికంగా ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌ను త‌గ్గించ‌డంతోపాటు.. పార్టీఐ క్య‌త‌కు పెద్ద‌పీట వేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక‌, టీడీపీలో కూడా అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. మండ‌లాలు, జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మ‌న్వ‌య క‌ర్త‌లు భేటీఅవుతున్నారు. ఆశ‌లు, ఆకాంక్ష‌లు ఎన్ని ఉన్న‌ప్ప‌టికీ.. కూట‌మికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. ఏ చిన్న తేడా వ‌చ్చినా.. వైసీపీకి మేలు జ‌రుగుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. దీంతో కూట‌మిలో కుమ్ములాట‌లు దాదాపు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని నాయ‌కులు చెబుతున్నారు.