అహంతో అంద‌రికీ దూర‌మై.. అఖిల పాలిటిక్స్‌‌ పై క‌ర్నూలు టాక్‌!!

టీడీపీ నాయ‌కురాలు.. మాజీ మంత్రి అఖిల ప్రియ‌.. హ‌ఫీజ్ పేట భూముల విష‌యంలో జ‌రిగిన కిడ్నాప్ కేసులో అరెస్ట‌యి.. బెయిల్ కూడా ల‌భించ‌ని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. అదేస‌మ‌యంలో ఈ కేసుకు సంబంధించి తొలుత ఏ-2గా ఆమె పేరును పేర్కొన్న పోలీసులు.. తెల్లారేస‌రికి ఏ-1 అని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

దీంతో అయ్యో.. ఏంటీ ఘోరం అనుకున్న‌వారు చాలా మంది ఉన్నారు. ఇక‌, త‌ర్వాత ప‌రిణామాల నేప‌థ్యంలో అఖిల ప్రియ సోద‌రి మౌనికా రెడ్డి రంగంలోకి దిగి.. మ‌హిళ‌ల ప‌ట్ల ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తారా? దేశం నుంచి కూడా బ‌హిష్క‌రిస్తారా? మ‌హిళ‌పైనా మీ ప్ర‌తాపం. పైగా గ‌ర్భిణిగా కూడా ఉన్న అక్క‌పై ఇంతా దాష్టీక‌మా?! అని దాదాపు క‌న్నీరు పెట్టుకున్న ప‌రిస్థితి చేశారు. దీంతో పాషాణ హృద‌యాలు కూడా క‌రుగుతాయ‌ని అనుకున్నారు.

స‌రే! ఇత‌ర ప్రాంతాలు, ఇత‌ర వ్య‌క్తుల గురించి ప‌క్క‌న పెడ‌దాం. భూమా అఖిల ప్రియ పుట్టి పెరిగి, రాజ‌కీయంగా దూకుడుగా వ్య‌వ‌హ‌రించిన సొంత జిల్లా క‌ర్నూలులో ఆమె గురించి ఎంత మంది సానుభూతి చూపిస్తున్నారు? అస‌లు ఈ విష‌యంలో ఎలా స్పందిస్తున్నారు? అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. చాలా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు వెలుగు చూశాయి. తల్లి మ‌ర‌ణంతో ఆళ్ల‌గ‌డ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అఖిల ప్రియ‌.. తండ్రి మ‌ర‌ణంతో మంత్రి పీఠాన్ని ద‌క్కించుకున్నారు. అయితే.. త‌ర్వాత అంతా తానే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు.

రాజ‌కీయంగా ఈ దూకుడు మంచిదే అయినా.. సొంత వారిని సైతం.. ఆమె లెక్క చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. రాజ‌కీయాల్లో రాక‌ముందు మాటేమోకానీ.. పొలిటిక‌ల్‌గా ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత‌.. మ‌రీ ముఖ్యంగా మంత్రి ప‌ద‌వి సాధించిన త‌ర్వాత‌.. అఖిల ప్రియ వివాదాల‌కు కేంద్రంగా మారార‌ని క‌ర్నూలు నేత‌లు బాహాటంగానే చెబుతున్నారు.

త‌న తండ్రి భూమా నాగిరెడ్డితో సన్నిహితంగా ఉన్న సమీప బంధువు శివరామిరెడ్డికి చెందిన క్రషర్ కంపెనీని స్వాధీనం చేసుకునేందుకు అఖిల ప్రయత్నించారు. దీనికి సంబంధించి తీవ్ర వివాదాల‌కు దిగారు ఈ క్ర‌మంలో పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారు. దీంతో శివరామిరెడ్డి అఖిలకు దూరమయ్యారు. నాగిరెడ్డి చిన్నాన్న, విజయ డెయిరీ చైర్మన్‌గా కొనసాగిన భూమా నారాయణరెడ్డిని ఆ కుర్చీ నుంచి తప్పించే ప్రయత్నం చేశారు.

దీంతో ఆయ‌నా దూరమయ్యారు. అఖిల పెద్దనాన్న భాస్కర్‌రెడ్డి కుమారుడు భూమా కిషోర్‌రెడ్డితో విభేదాలు పొడచూపాయి. దీంతో అతను బీజేపీలో చేరారు. ఇదే సందర్భంలో నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సోదరుడు మహేశ్‌ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు.

ఇలా ఒక్కొక్కరుగా ‘భూమా’ బంధువులు పూర్తిగా అఖిలకు దూరమయ్యారు. ఈ పరిణామాలతో ఆళ్లగడ్డ, నంద్యాలలోని ‘భూమా’ వర్గం కూడా రాజకీయంగా ప్రత్యామ్నాయాలను వెతుక్కున్నారు. దీంతో ఆళ్లగడ్డకు అఖిల వచ్చినా కనీసం పదిమంది ఇంటికి రావడం లేదు. పోనీ.. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చిన పార్టీలో అయినా.. ఆమె స్థిమితంగా రాజ‌కీయాలు చేయ‌లేద‌ని.. అంద‌రినీ క‌లుపుకొని పోయే ప్ర‌య‌త్నం ఏనాడూ చేయ‌లేద‌ని క‌ర్నూలు పొలిటీషియ‌న్లు చెబుతున్నారు.

ప్ర‌ధానంగా త‌న తండ్రి కి అత్యంత ఆత్మీయుడు, ప్ర‌స్తుత కిడ్నాప్ కేసులో నిందితుడుగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డితో నువ్వెంతంటే నువ్వెంత‌? అనే రేంజ్‌లో అఖిల దూకుడు ప్ర‌ద‌ర్శించారు. అంతేకాదు, ఆయ‌న‌ను హ‌త్య చేయించేందుకు ప్ర‌య‌త్నించార‌నే అభియోగాలు కూడా ఉన్నాయి. ఇలా… అఖిల ప్రియ‌ను తర‌చి చూస్తే.. బ్యాక్‌గ్రౌండ్ చాలా బ్యాడ్‌గా ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అందుకే ఏ ఒక్క‌రూ సానుభూతి చూపేందుకు కూడా ముందుకు రాలేద‌ని అంటున్నారు.