ఏపీ సర్కార్ కు హైకోర్టులో డబుల్ షాక్

ఏపీ సర్కార్ కు హైకోర్టులో ఒకే రోజు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో…కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు, పంచాయితీ కార్యాలయాలపై వైసీపీ రంగుల అంశంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది.

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. న‌గ‌రి ఎమ్మెల్యే రోజా, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుద‌ల రజినీ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడలు సమావేశాలు, సభలు, కార్యక్రమాల పేరుతో లాక్ డౌన్ నిబంధనలు తుంగలో తొక్కారని లాయర్ కిషోర్ పిల్ దాఖలు చేశారు.

వైసీపీ ఎమ్మెల్యేలు అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డుకోవడంతో పాటు నిబంధనలు పాటించ‌ని వైసీపీ నేత‌ల‌కు కరోనా పరీక్షలు నిర్వహించాలని పిటిషన్‌లో కోరారు. లాక్ డౌన్ అమలవుతుండగానే… వైసీపీ నేతలు…ప్రజలకు నిత్యావసరాలను పంచడం, డబ్బు పంపిణీ చేయడం, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేశారని ఆరోపణలు వచ్చాయి.

ఈ కార్యక్రమాల సందర్భంగా సోషల్ డిస్టెన్స్ కూడా పాటించలేదనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి విజువల్స్ మీడియాలో ప్రసారమయ్యాయి. దీంతో, వారిపై పిల్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులిచ్చింది.

న్యాయవాది ఇంద్రనీల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం నిబంధనలను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ ప్రభుత్వాన్ని, డీజీపీని కోరింది. ఈ వ్యవహారంపై వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, డీజీపీని హైకోర్టు ఆదేశించింది.

మరోవైపు, హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగలింది. పంచాయితీ కార్యాలయాలపై వైసీపీ రంగుల అంశంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. ఈ నెల 19వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవో నంబర్ 623ని హైకోర్టు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో, ఒకే రోజు జగన్ సర్కార్ కు రెండు ఎదురుదెబ్బలు తగిలినట్లయింది. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు తొలగించాలని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ఆ మూడు రంగులకు తోడుగా మట్టి రంగును జత చేసే విధంగా ఏపీ ప్రభుత్వం మరో జీవో నంబర్ 623 జారీ చేసింది. జీవో 623పై కూడా పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, విచారణ చేపట్టిన హైకోర్టు ఆ జీవోను కొట్టి వేసింది.