పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. “షాబాద్ ఘ‌ట‌న దారుణం“ అని పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసుల వైఫ‌ల్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని పేర్కొన్నారు. ఇలాంటి విష‌యాల‌పై గ‌తంలో సుప్రీంకోర్టు అనేక సంద‌ర్భాల్లో హెచ్చ‌రించింద‌ని తెలిపారు. కానీ, పోలీసులు నామ‌మాత్రంగానే స్పందిస్తున్నార‌ని పేర్కొన్నారు. దీని ఫ‌లితంగానే దారుణాలు చోటు చేసుకున్నాయ‌న్నారు.

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఇటీవ‌ల వ‌రుస‌గా ఆరుగురిని ఓ వ్య‌క్తి క‌త్తితో న‌రికి చంపాడు. వీరిలో తన భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. అనంత‌రం.. రెండు రోజుల త‌ర్వాత‌.. గ‌డ్డి మందు తాగి అత‌ను కూడా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ వ్య‌వ‌హారం.. రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. అయితే.. దీనికి ముందు.. అత‌నిపై ఓ కుటుంబం పోక్సో కేసు పెట్టింది. కొన్నాళ్ల‌పాటు అత‌ను జైల్లోనే ఉన్నాడు. జైలు నుంచి బెయిల్‌పై తిరిగి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ దారుణ మార‌ణ‌కాండ‌కు తెగ‌బ‌డ్డాడు.

త‌న‌పై పోక్సో కేసుపెట్టిన కుటుంబం స‌హా.. తానుజైల్లో ఉంటే క‌నీసం ప‌రామ‌ర్శించేందుకు కూడా రాలేద‌న్న కార‌ణంగా భార్యా బిడ్డ‌ల‌ను కూడా అత‌ను తెగ‌న‌రికాడు. ఈ వ్య‌వ‌హారం తీవ్ర వివాదంగా మారింది. అయితే.. ఈ ఘ‌ట‌న‌లో పోక్సో నిందితుడుగా ఉన్న వ్య‌క్తికి బెయిల్ రావ‌డ‌మే త‌ప్ప‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. అతినికి బెయిల్ వ‌చ్చినందుకే ఇలాంటి ఘోరం జ‌రిగిందన్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. వీటిని ప్ర‌స్తావిస్తూ.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ సంధించారు.

పోక్సో కేసులోనిందితుడిగా ఉన్న వ్య‌క్తికి బెయిల్ రాకుండా చూడాల్సిన పోలీసులు ఆ విష‌యంలో విఫ‌ల‌మ‌య్యార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ కేసుల విచార‌ణ‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల‌న్న సుప్రీంకోర్టు ఉత్త‌ర్వుల‌ను కూడా ఆయ‌న గుర్తు చేశారు. సాక్ష్యాధారాల‌ను మాయం చేయ‌కుండా చూసుకోవాల్సిన బాధ్య‌త కూడా పోలీసుల‌పై ఉంటుంద‌న్నారు. ఈ కేసులో పోలీసులు విఫ‌ల‌మ‌య్యార‌ని పేర్కొన్నారు. షాబాద్ కేసులో పోక్సో కేసు పెట్టిన బాధితుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో పోలీసులు పూర్తిగా వైఫ‌ల్యం చెందార‌ని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుల‌ను ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఉద‌హ‌రించారు.