పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులతో పాటు మీమర్లు, ట్రోలర్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. జగన్ కూడా వారిని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయకుండా వారికి సరిపడా కంటెంట్ ఇచ్చి వెళ్లిపోతుంటారు. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే వైసీపీ నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు ఆయన ఏం మాట్లాడతారో, ఏం బ్లండర్స్ ఆయన నోటి నుంచి వినాల్సి వస్తుందో అని కంగారు పడుతుంటారు అంటే అతిశయోక్తి కాదు.

ఈ నేపథ్యంలోనే ఈ రోజు విశాఖలో పర్యటించిన జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే అది అతిశయోక్తి కాదు అనిపిస్తుంది. 18 ఏళ్ల పిల్లోడు సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ బైక్ తోలుతూ ఖర్మ కొద్దీ ఒక మనిషిని గుద్ది చంపేశాడని, ఆ పిల్లోడికేం తెలుసని చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

తాను ఆ యాక్సిడెంట్ ను సమర్థించడం లేదంటూనే..యాక్సిడెంట్లు జరగడం సర్వసాధారణం అన్న రీతిలో జగన్ మాట్లాడారు. 18 ఏళ్ల వయసుంటే పిల్లాడు కాదు..యువకుడు అంటారు అని, ఆ యువకుడు అతి వేగంగా వచ్చి గుద్దడంతోనే ఒక గొర్రెల కాపరి చనిపోయాడని జగన్ మరిచిపోయినట్లున్నారు.

అయితే, ఇక్కడ అసలు మ్యాటర్ అది కాదు. యాక్సిడెంట్ చేసిన తర్వాత అప్పల రాజు కొడుకు పోలీసులకు లొంగిపోలేదు. అతడిని తప్పించేందుకు అప్పలరాజు విశ్వప్రయత్నం చేయగా అది విఫలమైంది. యాక్పిడెంట్ చేసింది అప్పల రాజు కొడుకు ఆరవ్ కాదని, ఆరవ్ స్నేహితుడని ముందు బుకాయించారు. అనుమానం వచ్చిన పోలీసులు…సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి చివరకు ఆరవ్ నిందితుడని గుర్తించారు. ఆ తర్వాత ఆరవ్ ను అరెస్టు చేశారు.

ఈ క్రమంలోనే హోమీసైడ్ సెక్షన్ల కింద ఆరవ్ పై కేసు నమోదు చేసే ప్రయత్నం చేసిందని, జగన్ తప్పుబట్టారు. ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితోనే ఆరవ్ పై హోమీసైడ్ సెక్షన్ల కింద మర్డర్ కేసు నమోదు చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.