రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ ఆ పార్టీ జిల్లా కార్యాలయాల్లో ఎక్కడికక్కడ వెలిశాయి. వైసీపీ కార్యాలయాలు వెలసిన ప్రదేశాలు ప్రభుత్వ స్థలాలా?… లేదంటే ప్రైవేట్ స్థలాలా? అన్న విషయాన్ని నాటి పాలకులు అస్సలు పట్టించుకోలేదనే చెప్పాలి. తాజాగా ఈ తరహా అక్రమాలపై విజయనగరం రాజ వంశస్తులు, కేంద్ర మాజీ మంత్రి, గోవా గవర్నర్ పూసపాటి అశోక గజపతి రాజు సంచలన విషయాలు వెల్లడించారు. తన స్థలంలో వైసీపీ జిల్లా కార్యాలయాన్ని కట్టారని ఆయన ఓ బాంబు లాంటి వార్తను పేల్చారు.

టీడీపీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన రాజు గారు… ఇటీవలే గోవా గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన చట్ట నిబంధనల మేరకు టీడీపీకి రాజీనామా చేసి… ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరిగి మరీ గవర్నర్ గిరీని చేపట్టారు. ఈ క్రమంలోనే సోమవారం తన సొంతూరు వచ్చిన రాజు గారు… వైసీపీ జమానాలో తనకు జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేసే దిశగా ఏకంగా మీడియా సమావేశాన్నే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు.

వైసీపీ అదికారంలో ఉండగా.,..తనెకు చెందిన ఓ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా మార్చేసి మరీ అందులో వైసీపీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించారని ఆయన ఆరోపించారు. ఓ ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా ఎలా మారుస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయం తనకు తెలిసినంతనే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశానని ఆయన పేర్కొన్నారు. అయితే జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఇప్పటిదాకా పెద్దగా స్పందనే లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటిదాకా ప్రైవేట్ వ్యక్తులకు చెందిన స్థలంగా ఉన్న భూమి ఉన్నపళంగా ఆ ప్రైవేట్ వ్యక్తులకే తెలియకుండా ప్రభుత్వ భూమిగా ఎలా మారుతుందని ఆయన ప్రశ్నించారు.

వైసీపీ హయాంలో చట్టాలను చుట్టాలుగా చేసుకునే ఈ తరహా అక్రమాలకు పాల్పడ్డారని రాజుగారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చట్టాలను తమకు చుట్టాలుగా చేసుకుని మనుగడ సాగిస్తామంటే ఎల్లకాలం కుదరదని కూడా ఆయన హెచ్చరించారు. అక్రమార్కుల దౌర్జన్యం ఓ వైపు ఉంటే… ఆయా అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఈ వివాదంపై ఏడాది క్రితమే కలెక్టర్ కు ఫిర్యాదు చేశానన్న రాజు గారు.. నాలుగు నెలల క్రితం ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కు మరోమారు గుర్తు చేశామని తెలిపారు. అయినా కలెక్టర్ కార్యాలయం నుంచి ఆశించిన మేర స్పందన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు రాజు గారు తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ గా ఉన్నారు కదా…ఈ తరహా ఆరోపణలు చేయడం సబబేనా? అని అడిగిన ప్రశ్నకు రాజు గారు ఓ రేంజిలో స్పందించారు. గవర్నర్ గా ఉండాలంటే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిబంధన ఉందని ఆయన అన్నారు. ఆ మేరకు గవర్నర్ గా ప్రమాణం చేయడానికి ముందే టీడీపీకి రాజీనామా చేశానని ఆయన తెలిపారు. ఎంత గవర్నర్ అయినా రాజకీయాలను వదులుకుంటే ఫరవాలేదు గానీ…కుటుంబాన్ని వదిలేయమని చెప్పలేరు కదా అంటూ ఆయన సెటైరిక్ ఆన్సర్లు ఇచ్చారు. ఇక మీడియా సమావేశం ఆద్యంతం చిరునవ్వుతోనే కనిపించిన రాజు గారు.. వైసీపీ పేరును ప్రస్తావించకుండానే ముగించడం గమనార్హం.