వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే అవ‌కాశాన్ని తీసుకువస్తున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. సేవ‌ల్లో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త కోస‌మే ఈ విధానాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, రెవెన్యూ సేవ‌ల‌పై ఆయ‌న స‌మీక్షించారు. చాలా మంది స్టేష‌న్ల‌కు రావాలంటే ఇప్ప‌టికీ జంకుతున్న ప‌రిస్థితి ఉంద‌ని సీఎం తెలిపారు. ఈ ప‌రిస్థితి పోవాల‌న్నారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అనే మాట‌ను తీసుకువ‌చ్చింది తొలుత తానేన‌ని చెప్పిన చంద్ర‌బాబు.. దీనిని అమ‌లు చేసే విష‌యంలోనూ రాష్ట్రం ఫ‌స్ట్ ఉండాల‌న్నారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం పెరుగుతోంద‌న్నారు. సాంకేతిక‌త‌ను వినియోగించుకుని నేరాల‌ను అరిక‌ట్టే దిశ‌గా అడుగులు వేయాల‌ని సూచించారు. స్టేష‌న్ల‌కు వ‌చ్చి.. ఫిర్యాదు చేసేందుకు ఇబ్బందులు ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో అన్ని స్టేష‌న్ల‌లోనూ వాయిస్ మెసేజ్‌తో ఫిర్యాదు స్వీక‌రించే వ్య‌వ‌స్థ‌ను అందుబాటులోకి తెస్తున్నామ‌న్నారు.

త‌ద్వారా ఎక్క‌డి నుంచి ఫిర్యాదు వ‌చ్చినా.. దానిని న‌మోదు చేసుకుని ఫాలో అప్ చేయాల్సిన బాధ్య‌త పోలీసుల‌పైనే ఉంటుంద‌ని సీఎం చెప్పారు. ఇక‌, రెవెన్యూ విభాగానికి సంబంధించిన ఫిర్యాదులు కూడా వాయిస్ మెసేజ్‌ల రూపంలో స్వీక‌రించి.. ప‌రిష్క‌రించేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. అలాగే అధికారుల‌పై ప‌ని ఒత్తిడి త‌గ్గించేందుకు కూడా ప్రయ‌త్నాలు చేస్తున్నామ‌ని.. 11 ర‌కాల సేవ‌ల‌ను దాదాపు కుదించేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు.

మ‌న మిత్ర పేరుతో అందుబాటులోకి తీసుకువ‌చ్చిన వాట్సాప్ వ్య‌వ‌స్థకు ప్ర‌జ‌లు బాగా క‌నెక్ట్ అవుతున్నార‌ని సీఎం తెలిపారు. దీనిని మ‌రింత విస్త‌రించే ఆలోచ‌న‌లో ఉన్నామ‌న్నారు. మ‌న‌మిత్ర వాట్సాప్ ద్వారా.. మెసేజ్ వాయిస్‌ల‌ను కూడా తీసుకుని వాటిని ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల‌కు నిత్యం అవ‌స‌ర‌మైన విభాగాల్లో పేష‌న్స్ అత్యంత ముఖ్య‌మని తెలిపారు. ఓర్పు, ఓపిక‌, స‌హ‌నంతో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు పరిష్క‌రించాల‌ని సూచించారు.