“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను విడుద‌ల‌చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. తృణ‌మూల్ కాంగ్రెస్‌, జాతీయ‌ కాంగ్రెస్‌పార్టీల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా లేక‌పోయి ఉంటే..నేడు ఉన్న ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రం బంగ్లాదేశ్‌లో క‌లిసిపోయి ఉండేద‌ని ఆరోపించారు. దీనికి కార‌ణం కాంగ్రెస్‌వేర్పాటు వాద సిద్ధాంత‌మేన‌ని పేర్కొన్నారు. బుజ్జ‌గింపు రాజ‌కీయాల‌కు ఆల‌వాల‌మైన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని వేరే దేశానికి ఇచ్చేయాల‌ని చూసింద‌న్నారు.

కులం-మతం-ప్రాంతం ఆధారంగా రాజ‌కీయాలు చేసే పార్టీల‌కు దేశంలో చోటు లేద‌ని.. గ‌త 12 సంవ‌త్స‌రాలుగా ప్ర‌జ‌లు నిరూపించార‌ని ప‌రోక్షంగా ఆయ‌న కాంగ్రెస్‌పై విరుచుకుప‌డ్డారు. మ‌రో వందేళ్ల‌యినా.. కాంగ్రెస్ పార్టీ విధానం ఇంతేన‌ని విరుచుకుప‌డ్డారు. పార్టీల‌ను బుజ్జ‌గించ‌డం.. నాయ‌కుల‌ను బుజ్జ‌గించ‌డం.. అవినీతి ప‌రుల‌ను బుజ్జ‌గించ‌డం.. శ‌త్రుదేశాల‌ను బుజ్జ‌గించ‌డ‌మే కాంగ్రెస్‌వాదుల విధానమ‌ని దుయ్య‌బ‌ట్టారు. స్వాతంత్రానికి పూర్వ‌మే ఈ ప్ర‌క్రియ కొంద‌రికి అల‌వాటైంది(నెహ్రూ). అందుకే.. ప‌శ్చిమ బెంగాల్‌ను నిల‌బెట్టుకునేందుకు నాడు అనేక మంది ర‌క్త‌త‌ర్ప‌ణం చేశారు. లేక‌పోతే.. ఏనాడో ఈ రాష్ట్రం ప‌రాయి దేశం పాల‌య్యేది అని వ్యాఖ్యానించారు.

బెంగాల్‌ను బంధ విముక్తం చేశామ‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. అరాచ‌కాలు, హింస‌, ఆధిప‌త్య ధోర‌ణి, ప్ర‌జ‌ల‌ను పీడించిన పార్టీల‌కు(టీఎంసీ) ప్ర‌జ‌లు బుద్ధి చెప్పార‌ని.. ప్ర‌ధాని అన్నారు. రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు స్వేచ్ఛ లేకుండా చేసిన శ‌క్తుల‌కు త‌గిన విధంగా గుణ‌పాఠం నేర్పార‌ని అన్నారు. అయినా.. ఆయా పార్టీల్లో మార్పు రావ‌డం లేద‌న్నారు. ప్ర‌స్తుతం ఏర్ప‌డిన బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ప్ర‌భుత్వ‌మ‌ని ప్ర‌ధాని చెప్పారు. ఏ స‌మ‌స్య ఉన్నా.. ప‌రిష్కారానికి ముఖ్య‌మంత్రి సువేందు అధికారి కార్యాల‌యం తెరిచే ఉంటుంద‌న్నారు. ఎవ‌రైనా ఎప్పుడైనా రావొచ్చ‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు.

కేంద్రం ప్ర‌జ‌ల సంక్షేమం కొసం.. అమ‌లు చేసిన ప‌థ‌కాల‌ను కూడా రాష్ట్రంలో గ‌త పాల‌కులు(మ‌మ‌తా బెన‌ర్జీ) అమ‌లు చేయ‌లేద‌న్నారు. నాపై క‌క్ష‌తో ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేశారు. నేను మీరు ఎన్నుకుంటే.. ప్ర‌ధాని అయ్యాను. అది వారికి న‌చ్చ‌దు. వారికే ప‌ద‌వులు కావాలి. ప్ర‌జ‌ల తీర్పుతో ప‌నిలేదు. అందుకే.. మీపై కోపం ప్ర‌ద‌ర్శించారు. కేంద్రం అమ‌లు చేసిన‌.. 200 ప‌థ‌కాల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు అంద‌కుండా చేశారు. కానీ, ఇప్పుడు ప్ర‌తి ప‌థ‌కం మీ ముందుకే వ‌స్తుంది. నేటి నుంచి కేంద్రం అందిస్తున్న అన్ని ప‌థ‌కాలు.. ప్ర‌జ‌ల‌కుచేరువ అవుతాయి. అని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు.