రాజకీయ చతురతలో మరోసారి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చాణక్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. సర్కారును ఇరుకున పెట్టేసి.. కుల, రాజకీయంగా కూడా.. తాము లబ్ధిపొందాలని భావించిన వైసీపీకి చంద్రబాబు ఊహించని షాక్ ఇచ్చారు. విషయం ఏదైనా.. తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పార్టీలు రెడీగానే ఉంటాయి. అందునా.. ఓటమి బాధ నుంచి ఇంకా తేరుకోని వైసీపీకి ఎక్కడ అవకాశం చిక్కితే అక్కడ ఛాన్స్ కొట్టేయాలని చూస్తోందనే టాక్వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు.. వైసీపీకి తురుపు ముక్కలా దక్కింది. ఈ కేసు వ్యవహారంపై తక్షణమే స్పందించిన జగన్.. బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. సీబీఐతో విచారణకు కూడా డిమాండ్ చేశారు. అదేసమయంలో కాపు కార్డును కూడా తెరమీదికి తెచ్చారు. వాస్తవానికి ఇలాంటి ఘటనల్లో మానవత్వం చూపడం అనేది సహజం. ఈ సమయంలో కులాలు, మతాలతో సంబంధం లేదు.
పోలీసుల స్వాధీనంలో ఉన్నట్టుగా భావిస్తున్న వ్యక్తి అదృశ్యం కావడం.. మృతిపై అనుమానాలు కూడా వ్యక్తమైన దరిమిలా.. దానిని ఆరూపంలోనే చూడాలి. ఆ కుటుంబానికి అలానే అండగా ఉండాలి. కానీ, వైసీపీ వెంటనే దీనికి కులం రంగు పూసేసి.. కాపు నేతలను రంగంలోకి దింపేసింది. ఈ పరిణామాలు జరిగిన సమయంలో చంద్రబాబు సింగపూర్లో ఉన్నారు. అయితే.. ఆయన అన్నింటినీ నిశితంగా గమనిస్తూ.. వైసీపీ మైలేజీ కోసం పడుతున్న తంటాలకు తనదైన శైలిలో బ్రేక్ వేశారు.
ఎక్కడా రాజకీయ విమర్శలు, కులాల విమర్శలు చేయకుండా.. ప్రభుత్వ పరంగానే చర్యల ద్వారా.. తనదైన శైలిలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు వ్యవహరించి.. బాధిత కుటుంబానికి భరోసా నింపే ప్రయత్నం చేశారు. నష్టం జరిగిందా? లేదా? అనేది విచారణలో తేలుతుంది. కానీ, ముందు బాధలో ఉన్న సాయికృష్ణ కుటుంబాన్ని ఓదార్చేందుకు.. హుటాహుటిన స్థానిక ఎమ్మెల్యేను వారి ఇంటికి పంపించారు. ఇది ఆ కుటుంబానికి భరోసా ఇచ్చింది.
అలానే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ.. నాగరాజును సస్పెండ్ చేసి.. అతనిపై హత్యాయత్నం సహా.. కఠిన సెక్షన్ల కింద(పోలీసులు చెప్పిన మేరకు) కేసులు నమోదు చేశారు. అంతేకాదు.. వెనువెంటనే విచారణకు ఎస్పీ స్థాయి అధికారిని నియమించారు. జగన్ ఆ కుటుంబాన్ని పరామర్శించిన తెల్లారే (శుక్రవారం) ఏసీపీ దైవ ప్రసాద్ వెళ్లి.. కుటుంబాన్ని పరామర్శించడంతోపాటు ధైర్యం చెప్పి విచారణ చేశారు. దీంతో సాయికృష్ణ కుటుంబం శాంతించింది. ప్రభుత్వంపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఫలితంగా ఏదో జరిగిపోతుంది.. ప్రభుత్వం ఇక ఇరుకున పడుతుందని భావించిన వైసీపీకి మైకులుకట్ అయ్యాయనే వాదన టీడీపీ నుంచి వినిపిస్తోంది.
అసలైతే..
వాస్తవానికి ఇలాంటి కేసుల్లో ప్రభుత్వాలపై వ్యతిరేకత వచ్చే మాట వాస్తవం. బాధిత కుటుంబాల్లోని వారు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతారు. ప్రభుత్వ పెద్దలను కూడా దూషిస్తారు. కానీ, ఈ కేసులో అలాంటివేవీ జరగలేదు. దీనికి కారణం.. సీఎం చంద్రబాబు తన చాతుర్యం వినియోగించి.. వెంటనే స్పందించారు. తూతు.. మంత్రంగా కాకుండా.. పక్కా విచారణ జరిగేలా చర్యలు చేపట్టారు. డీజీపీని సైతం హెచ్చరించారు. దీంతో సర్కారు ఈ విషయంలో పక్కాగా ఉందన్న సంకేతాలు ఇవ్వడంతో వైసీపీ రాజకీయాలకు బ్రేకులు పడ్డాయని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates