రిషికొండ ప్యాలెస్… కూటమికి గుదిబండేనా?

రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇట్టే గుర్తుకు వస్తారు. కూటమి సర్కారు చెబుతున్న దాని ప్రకారం ఈ నిర్మాణం కోసం నాటి జగన్ సర్కారు ఏకంగా రూ.500 కోట్లను వెచ్చింది. తాను రెండో టెర్మ్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపడితే.. విశాఖ నుంచే పాలనను సాగిస్తానని చెప్పిన జగన్… అక్కడ తన కోసం ఈ భవనాన్ని నిర్మించుకున్నారు. అయితే జగన్ ఆశించినట్లుగా వైసీపీ గెలవలేదు. ఫలితంగా జగన్ కట్టించిన ఈ భవనం ఇప్పుడు కూటమి సర్కారుకు గుది బండగా మారిందని చెప్పక తప్పదు.

అదేంటీ… రూ.500 కోట్ల భారీ ఖర్చుతో నిర్మించిన ఈ భవనాన్ని ప్రైవేటు సంస్థలకు అద్దెకో, లీజుకో ఇస్తే సరిపోతుంది కదా అన్న వాదనలు ఇదివరకే వినిపించాయి. కూటమి సర్కారు కూడా ఇదే భావనతో పర్యాటక, ఆతిథ్య రంగంలోకి పలు సంస్థలకు ఈ భవనాలను అద్దెకు ఇచ్చేందుకు ఆసక్తి చూపింది. అందులో భాగంగా ప్రభుత్వ ఆహ్వానంతో విశాఖకు వస్తున్న ఆయా రంగాల సంస్థలు… రిషికొండ ప్యాలెస్ ను ఎగాదిగా చూసి… దీనిని తాము అద్దెకు తీసుకోలేమని, ఇది తమకు ఏమాత్రం అనుగుణంగా లేదని తేల్చి చెప్పేస్తున్నాయట. మరి అటు ప్రభుత్వం వాడక, ఇటు ప్రైవేటు సంస్థలు అద్దెకు తీసుకోకపోతే…వందల కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనాలు కూటమి సర్కారుకు గుది బండే కదా.

కూటమి సర్కారు కొలువుదీరిన వెంటనే… ఈ భవనాన్ని ఏం చేయాలో ఐడియాలు ఇవ్వాలంటూ ప్రజలకు ప్రభుత్వం ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కో రకమైన సలహా ఇవ్వగా… ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు ఇస్తే బాగుంటుందన్న వాదన బలంగా వినిపించింది. ఆ దిశగానూ ప్రభుత్వం అడుగులు వేసినా.. ఇప్పటికీ ఫలితం రాలేదని సమాచారం. అయినా రూ.500 కోట్లతో అత్యంత విలాసవంతంగా నిర్మితమైన రిషికొండ భవనాలను అద్దెకు తీసుకునేందుకు ఆయా సంస్థలు ఎందుకు నిరాకరిస్తున్నాయన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అదేంటంటే… రూ.500 కోట్ల మేర ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేసిన జగన్ సర్కారు.. రిషికొండ భవనాల్లో కేవలం 20 గదులను మాత్రమే నిర్మించిందట. నిజమా? అంటే… అక్షరాల ఈ మాట నిజమే. ఓ సీఎం తన అధికారిక నివాసాన్ని 20 గదుల కంటే అదికంగా నిర్మించుకోరు కదా. అయితే ఆ 20 గదులకే రూ.500 కోట్లు తగలేయడమనేది ఇక్కడ అత్యంత వివాదాస్పద అంశం.

ఆతిథ్య రంగంలోకి హోటళ్ల కోసం ఈ నిర్మాణాలను తీసుకుంటే.. కేవలం 20 గదులు అందుబాటులో ఉండే ఈ భవనానికి ఆయా సంస్థలు కోట్ల రూపాయల మేర అద్దెను చెల్లించలేవు కదా. ఆయా సంస్థలు కూడా 20 గదులు మాత్రమే ఉన్న ఈ భవనాలను తామేం చేసుకుంటామని చెబుతున్నాయట. వెరసి జగన్ తానే సీఎంగా కొనసాగుతానని, తన కోసం, తన కుటుంబం కోసం కట్టించుకున్న రిషికొండ ప్యాెలెస్ ఇప్పుడు కూటమి సర్కారుకు గుదిబండగానే మారిందని చెప్పక తప్పదు.