చిన్ని వర్సెస్ నాని… పీక్స్ కు వెళ్లినట్టే!

కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని… కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని… ఇద్దరూ తోడబుట్టిన అన్నదమ్ములే. అంతేనా వారిద్దరూ ఒకే పార్టీతోనే రాజకీయాలు మొదలుపెట్టారు. ఇద్దరూ బెజవాడ నుంచే ఎంపీలుగా విజయం సాధించారు. 2024 ఎన్నికల దాకా ఈ అన్నాదమ్ముల మధ్య ఎంత విభేదాలున్నా బయటకు అయితే రాలేదు. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు కాస్తంత ముందుగా పొడచూపిన విభేదాలతో టీడీపీని వీడిన నాని వైసీపీలో చేరిపోయారు. ఇక అప్పటి నుంచి వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. తాజాగా ఎంపీగా ఉన్న తన తమ్ముడిపై నాని ఏకంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కే ఫిర్యాదు చేశారు. వెరసి వీరి మధ్య వైరం పీక్స్ కు వెళ్లిందని చెప్పక తప్పదు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో బెజవాడ లోక్ సభ నుంచి ఈ అన్నాదమ్ములే పోటీ పడగా… అన్నను చిత్తు చేసి తమ్ముడు ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి తమ్ముడిపై భగ్గుమంటున్న నాని… ఎప్పకటిప్పుడు చిన్నిపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో వైసీపీకి దూరంగా జరిగిన నాని…టీడీపీకి చేరువగా జరుగుతున్నా కూడా తమ్ముడిపై తన వైరాన్ని మాత్రం ఆయన వీడటం లేదు. వెరసి వీరిద్దరి మధ్య విభేదాలు ఎక్కడిదాకా వెళతాయోనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

ఇప్పటికే చిన్నిపై నాని పలుమార్లు అవినీతి ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం చిన్ని చాలా విషయాల్లో అవినీతికి పాల్పడ్డారని, వాటి వివరాలను తెలియజేస్తూ… సదరు అవినీతిపై తక్షణమే సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన నేరుగా ఈడీకే లేఖ రాశారు. ఆ లేఖకు సంబందించిన ప్రతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈడీకి రాసిన లేఖను నాని..ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడులకు కూడా పంపారు.

ఇక ఈ లేఖలో నాని ఏఏ అంశాలను ప్రస్తావించారన్న విషయానికి వస్తే… వైసీపీ హయాంలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో చిన్నికి పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా 2024 ఎన్నికల్లో బెజవాడ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సీట్లను చిన్ని అమ్ముకున్నారని, ఈ సందర్భంగా ఒక్కో సీటుకు ఆయన రూ.5 కోట్లు తీసుకున్నారని నాని ఆరోపించారు. హైదరాబాద్ కేంద్రంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో ప్రీ లాంచింగ్ పేరిట చిన్ని భారీగా దండుకున్నారని తెలిపారు.

హైదరాబాద్ లోని ప్రగతి నగర్ లో 112 ఎకరాలను చిన్ని కబ్జా చేశారని ఆరోపించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టును కూడా చిన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో అక్రమాలతో పాటు ఉత్సవాల పేరిట భారీ ఎత్తున అక్రమార్జనకు పాల్పడుతున్నారని, అక్రమ మైనింగ్ చేస్తున్నారని చిన్నిపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటిదాకా జరిగిందే చాలా ఎక్కువ అని, ఇప్పటికైనా చిన్ని అవినీతికి చెక్ పెట్టి తాను పేర్కొన్న అంశాలపై దర్యాప్తు చేపట్టాలని నాని కోరారు. మరి ఈ లేఖపై ఈడీ ఎలా స్పందిస్తుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.