మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం పాటు ప్రధానిగా కొనసాగిన నేతగా ఆయన చరిత్ర పుటలకెక్కారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని విజయ బాటన నడిపిన మోదీ… ఆ వెంటనే ప్రధాని పీఠం అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ మోదీ వరుస విజయాలు సాధించారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రధాని పదవి చేపట్టి బుధవారం నాటికి 4,399 రోజులైంది. దీంతో భారత ప్రధానిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన నేతగా మోదీ రికార్డులకెక్కారు.

మంగళవారం దాకా ఈ రికార్డు స్వతంత్ర భారతావనికి మొట్టమొదటి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన జవహర్ లాల్ నెహ్రూ పేరిట ఉండేది. భారత ప్రధానిగా నెహ్రూ విరామం లేకుండా 4,398 రోజుల పాటు కొనసాగారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్ పేయి, మన్మోహన్ సింగ్ తదితరులు సుదీర్ఘ కాలం పాటు దేశ ప్రధానులుగా పనిచేసినా వారిలో ఏ ఒక్కరు కూడా నెహ్రూ రికార్డును చేరుకోలేకపోయారు. 4,398 రోజుల పాటు నాన్ స్టాప్ గా ప్రధాని పదవిలో కొనసాగాలంటే ఏకంగా మూడు పర్యాయాలు ఎన్నికల్లో నెగ్గి మూడు పర్యాయాలు ప్రధానిగా పదవీ ప్రమాణం చేయాల్సి ఉంది. ఈ కారణంగానే నెహ్రూ రికార్డును ఇప్పటిదాకా ఏ ఒక్కరు కూడా బద్దలు కొట్టలేకపోయారు.

అయితే దేశంలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తననూ మార్చుకుంటూ సాగిన బీజేపీ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకుంది. అప్పటిదాకా దేశంలో కాంగ్రెస్ గుత్తాధిపత్యం సాగినా… జనతా పార్టీ కాంగ్రెస్ కు ఎదురొడ్డి నిలిచినా…రాజకీయాల్లో స్థిరత్వాన్ని సాధించలేకపోయింది. ఫలితంగా తిరిగీ కాంగ్రెస్సే గెలుస్తూ వచ్చింది. అయితే జనసంఘ్ పేరిట ఓ చిన్న రాజకీయ పార్టీగా పుట్టి.. ఆ తర్వాత బీజేపీగా మారి దేశ రాజకీయాలను తన వైపునకు తిప్పుకున్న వైనం నిజంగానే అద్భుతమనే చెప్పాలి. బీజేపీ ఎదుగుతున్న మాదిరిగానే… ఆ పార్టీలో మోదీ కూడా కింది స్థాయి నుంచి ఎదిగారు.

ఇక ప్రస్తుతం మోదీ పేరిట నమోదు అయిన ఈ అరుదైన రికార్డు విషయానికి వస్తే… నెహ్రూ పేరిట ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోవడానికి ఏకంగా 60 ఏళ్లకు పైగా సమయం పట్టింది. నాడు దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను దేశ ప్రజలు చాలా రోజుల పాటు ఆదరించారు. అసలు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం వస్తుందా? అన్న మాటలూ నాడు వినిపించాయి. అయితే జనతా పార్టీ వచ్చినా… దాని తర్వాత వచ్చిన బీజేపీ మాత్రమే కాంగ్రెస్ ఏళ్ల తరబడి విపక్షంలో కూర్చోబెట్టగలిగింది.

నాడు ఏక పార్టీ ఉంటే.. నేడు రాష్ట్రానికో పార్టీ, ఉత్తర భారతం, దక్షిణ భారతం అంటూ విభేదాలు… ఇలా లోక్ సభలో బీజేపీ స్థాయిలో మెజారిటీ సాదించడం సమీప భవిష్యత్తులో దుస్సాధ్యమేనని చెప్పాలి. ఒకవేళ వేరే ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. బీజేపీ కొనసాగినంతకాలం పాటు అధికారాన్ని అట్టిపెట్టుకోవడం కష్టమే. వెరసి మోదీ రికార్డు ఇప్పుడప్పుడే చెరిపివేయడం సాధ్యం కాదని చెప్పొచ్చు.