ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం వహిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరిస్తున్నారు ఏం చేస్తున్నారు అనే విషయాలపై తరచుగా నివేదికలు తప్పించుకుంటున్నారు. సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. అయితే, మరో కీలక పార్టీగా ఉన్న జనసేన పరిస్థితి ఏంటి అనేది చర్చ నియాంశంగా మారింది.
మొత్తం 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన 21 స్థానాల్లో కూడా విజయం దక్కించుకుంది. వీటిలో పిఠాపురం నియోజకవర్గాన్ని పక్కనపెడితే మిగిలిన 20 నియోజకవర్గాల్లో గత రెండు సంవత్సరాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది.. ఏం చేస్తున్నారు.. అనే అంశాలపై పవన్ కళ్యాణ్ నివేదికలు తెప్పించుకుంటున్నామని చెబుతున్నా.. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా నివేదికలు సమర్పించలేదని తెలిసింది. ఎప్పటికప్పుడు వాయిదా వేయడంతో పాటు నివేదికలకు ఇచ్చే విషయంలో ఎమ్మెల్యేలు తాత్సారం చేస్తున్నారన్నది పార్టీ వర్గాల్లోనే జరుగుతున్న చర్చ.
దీనికి ప్రధాన కారణం నియోజకవర్గాల స్థాయిలో దాదాపు అందరు ఎమ్మెల్యేలు కూడా పై స్థాయిలో చెబుతున్న మాటలను దిశానిర్దేశాన్ని పట్టించుకోకపోవడమే కారణం అని తెలుస్తోంది. వాస్తవానికి జనసేన పార్టీలో నాయకులకు కొన్ని సిద్ధాంతాలు నిబద్ధత ఉండాలనేది పవన్ కళ్యాణ్ చెబుతున్న మాట. ఇటీవల కూడా ఆయన పదేపదే ఈ విషయాన్ని చెప్పారు. తద్వారా ప్రజలకు చేరువ కావాలని కూడా సూచించారు. కానీ, 21 నియోజకవర్గాల్లో దాదాపు 16 నియోజకవర్గాల పరిస్థితి ఇబ్బందికరంగా ఉందన్నది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో జనసేన అధినేత ఎమ్మెల్యేలను అలర్ట్ చేయడంతో పాటు సరైన దిశలో నడిపించాల్సిన అవసరం కూడా ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఎన్నికలకు మూడు సంవత్సరాల సమయం ఉంది కదా అని కూర్చుంటే అప్పటికి పరిస్థితి మరింత విషమించే అవకాశం కూడా ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
