జర్మనీ నియంత పాలకుడు హిట్లర్ను తాను స్ఫూర్తిగా తీసుకున్నట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ఆశ్చర్యంగా మారింది. ఆయనను స్ఫూర్తిగా తీసుకునే తాము హైదరాబాద్లో హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చామన్నారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా హైడ్రా పనిచేస్తోందన్నారు. దీనిలో 3 వేల మంది రిటైర్డ్ సైన్యాన్ని నియమించామని చెప్పారు. దీనిని మరింత విస్తరిస్తామని చెప్పారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎన్ని వివాదాలు వచ్చినా హైడ్రా కొనసాగుతుందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆధారిత వ్యవసాయం సాగేదని.. కానీ, చెరువులను కబ్జా చేసిన కారణంగానే రైతులు, వ్యవసాయం పూర్తిగా దెబ్బతిందని సీఎం చెప్పారు. అందుకే హైడ్రా ద్వారా దీనిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పుడు చెరువులు, కుంటలు సహా అన్నింటినీ హైడ్రా రక్షిస్తోందని తెలిపారు. కొందరు స్వచ్ఛందంగా ఆక్రమణలను వదిలేసి వెళ్లిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. హైడ్రా నిజాయితీగా పనిచేయకపోతే.. ఇలా జరిగేదా? అని విపక్షాలను ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను సంపూర్ణంగా అమలు చేస్తున్నట్టు సీఎం తెలిపారు. వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటివి కొనసాగిస్తున్నామన్నారు. మహిళలకు పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యత కూడా అప్పగించామన్నారు. ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న భయం తెలంగాణలో లేదని చెప్పారు. దీనిని ఎదుర్కొనేందుకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని.. స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నట్టు తెలిపారు. అయినా.. కొందరు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates