‘ద‌క్షిణాది సొమ్ము దోచిపెడుతున్నారు’

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర‌య్యారు. ద‌క్షిణాది రాష్ట్రాల సొమ్మును ఉత్త‌రాది రాష్ట్రాల‌కు ప్ర‌ధాని దోచి పెడుతున్నార‌ని విమ‌ర్శించారు. దీనికి అంద‌మైన జీఎస్టీ ముసుగు తొడిగార‌ని వ్యాఖ్యానించారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు రూపాయిలో 45-50 పైస‌లు వాటా ల‌భిస్తుంటే.. ఉత్త‌రాది రాష్ట్రాల‌కు ఏడెనిమిది రెట్ల వ‌ర‌కు పంచుతున్నార‌ని తెలిపారు.

బీహార్‌కు రూపాయికి ఆరు రూపాయ‌ల 50 పైస‌లు చొప్పున‌, ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు 3 రూపాయ‌ల 50 పైస‌ల వంతున, మ‌ధ్య ప్ర‌దేశ్‌కు 3 రూపాయ‌ల 50 పైస‌ల వంతున ఇలా.. ద‌క్షిణాది రాష్ట్రాల‌ నుంచి వ‌చ్చిన సొమ్మును ఉత్త‌రాది రాష్ట్రాల‌కు పంచుతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇది వివ‌క్ష కాదా? అని ఆయ‌న నిల‌దీశారు. జాతీయ మీడియా నిర్వ‌హించిన కాన్‌క్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిపై నిప్పులు చెరిగారు.

అవెందుకు?

కేంద్ర మంత్రివ‌ర్గంలోనూ ద‌క్షిణాది రాష్ట్రాల‌కు వివ‌క్ష కొన‌సాగుతోంద‌న్నారు. హోం నుంచి ర‌క్ష‌ణ వ‌ర‌కు అన్ని కీల‌క మంత్రి ప‌ద‌వుల‌ను ఉత్త‌రాది నాయ‌కుల‌కే క‌ట్ట‌బెడుతున్నార‌ని వ్యాఖ్యానించారు. ద‌క్షిణాది రాష్ట్రాల్లోని నాయ‌కుల‌కు ఇస్తున్న ప‌ద‌వుల‌పైనా పెత్త‌నం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి సెల్యూట్ చేస్తూ.. జీ హుజూర్ అంటూ.. సెకండ‌రీ సిటిజ‌న్స్‌గా జీవించాల‌ని నేను భావించ‌డం లేదు అని తేల్చి చెప్పారు. ద‌క్షిణాది రాష్ట్రాలు ఆది నుంచి త‌మ ఆత్మ‌గౌర‌వం కోసం నిల‌బ‌డుతున్నాయన్నారు.

మా పోటీ ఏపీతో కాదు!

తెలంగాణ‌కు ఏపీ స‌హా ఇత‌ర రాష్ట్రాలేవీ పోటీ కాద‌ని సీఎం రేవంత్ చెప్పారు. తమ పోటీ.. అభివృద్ది చెందిన చైనా, జ‌పాన్‌, ద‌క్షిణ కొరియా వంటి దేశాల‌తోనే ఉంటుంద‌న్నారు. త్వ‌ర‌లోనే చైనాను తాము రీప్లేస్ చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం చైనా ఉత్ప‌త్తులే అన్ని అంగ‌ళ్ల‌లోనూ క‌నిపిస్తున్నాయ‌ని.. రాబోయే రోజుల్లో తెలంగాణ ఉత్ప‌త్తులే క‌నిపిస్తాయ‌ని.. తెలంగాణ మాటే వినిపిస్తుంద‌ని చెప్పారు. ఇది ఆత్మ‌గౌర‌వ పోరాట‌మ‌ని వ్యాఖ్యానించారు.

గుజ‌రాత్ గుంజుకుంటోంది!

పెట్టుబ‌డుల విష‌యంలో అన్ని రాష్ట్రాల మ‌ధ్య పోటీ ఉండాల‌ని తాను కూడా కోరుకుంటున్న‌ట్టు సీఎం తెలిపారు. అయితే.. న్యాయంగా ధ‌ర్మంగా ఈ పోటీ ఉండాల‌ని, కానీ, ప్ర‌ధాని మోడీ సొంత రాష్ట్రం గుజ‌రాత్ విష‌యంలో మాత్రం పెట్టుబడుల‌ను ఆక‌ర్షించ‌డం లేద‌ని.. న‌యానో.. భ‌యానో.. పెట్టుబ‌డి దారుల‌ను గుంజుకుని తమ రాష్ట్రానికి తీసుకువెళ్తున్నార‌ని ఆరోపించారు. గుజ‌రాత్ కోసం.. గ‌త 20 ఏళ్లుగా ఒకే ఒక్క అధికారి ప‌నిచేస్తున్నారంటే.. దీని అర్థం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇలాంటి వాటినే తాము వ్య‌తిరేకిస్త‌న్నామ‌ని తెలిపారు.