అందరూ సవాళ్లు రువ్వుతున్నారు.. తాను మాత్రం తక్కువ తిన్నానా.. అని అనుకున్నారో ఏమో.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇతర నేతల మాదిరిగానే ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డి భారీ సవాలే రువ్వారు. కేంద్రం ఇస్తున్న సొమ్ములపై సచివాలయం వద్దే చర్చకు వస్తామని.. ప్రభుత్వం తరఫున ఎవరు వచ్చినా.. చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. దమ్ముంటే రావాలని అన్నారు.
అయితే.. వాస్తవానికి కేంద్రం ఇచ్చిన సొమ్ము జీఎస్టీలో వాటా కిందే వచ్చాయి. కానీ, శనివారం రాత్రి రంగా రెడ్డి జిల్లా కోహెడలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం గురించి.. దాని కొనుగోళ్ల విషయంలో కేంద్రం చేస్తున్న తాత్సారం గురించి ప్రశ్నించారు. ఈ నెల 15లోగా రైతుల నుంచి ప్రతి గింజను కొనుగోలు చేయాల్సిందేనన్నారు. అయితే.. ఇది బీజేపీ చీఫ్కు ఎలా అర్ధమైందో ఏమో తెలియదు కానీ.. కేంద్రం నుంచి 13 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయన్నారు.
ఈ నిధులు వచ్చాయో.. లేదో ప్రభుత్వం చెప్పాలని రామచందర్రావు నిలదీశారు. రైతులను ఏమార్చి కోహెడలో పండ్ల మార్కెట్కు సీఎం రేవంత్ భూమి పూజ చేశారని అన్నారు. రైతుల నుంచి సేకరించిన భూమికి రూపాయితో సహా.. పరిహారం చెల్లించిన తర్వాతే.. పనులు ప్రారంభించాలన్నారు. కేంద్రంపై సీఎం రేవంత్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న రామచందర్రావు.. ఏ విషయాన్నీ తాము తేలికగా తీసుకోవడం లేదని చెప్పారు.
నేతలకు హెచ్చరిక..
ఇక, పనిలో పనిగా కాంగ్రెస్ నాయకులకు రామచందర్రావు తీవ్ర హెచ్చరిక చేశారు. తమ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే.. కాంగ్రెస్ నాయకులు రోడ్లపై తిరగలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కార్యకర్తలకు కనుసైగ చాలన్నారు. ఇక, కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలని సూచించారు.
అయితే.. చిత్రం ఏంటంటే.. బీజేపీ కార్యకర్తలు అంత భారీ సంఖ్యలో ఉంటే.. ఇంత పరాభవం ఎలా దక్కిందా? అనేది ప్రశ్న. పైగా ప్రధాన ప్రతిపక్షం కూడా కాని బీజేపీ.. ఇలా హెచ్చరించడం ఎందుకంటే.. ఇతర నాయకుల కంటే తాను వెనుకడుతున్నట్టు సంకేతాలు రావడమేనని తెలిసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates