రాము స‌వాల్‌.. కొడాలి మౌనం.. హీటెక్కిన‌ గుడివాడ.. !


ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ రాజ‌కీయాలు వేడెక్కాయి. గ‌త రెండేళ్ల పాల న‌లో తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు.. రెడీ అంటూ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు వెనిగండ్ల రాము ప్ర‌క‌టించారు. అంతేకాదు.. త‌న‌ను విమ‌ర్శిస్తున్న‌వారు.. ద‌మ్ముంటే ముందుకు రావాల‌ని కూడా ఆయ‌న స‌వాల్ రువ్వారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ముందుకు రాలేదు. వైసీపీ శిబిరం.. ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. మౌనంగా ఉండిపోయింది.

అస‌లు ఏం జ‌రిగింది.. ?
వెనిగండ్ల రాము.. 2024 ఎన్నిక‌ల్లో గుడివాడ నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. అప్ప‌టి వ‌ర‌కు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోయిన కొడాలినానిని నిలువ‌రించి.. సుదీర్ఘ‌కాలం త‌ర్వాత‌.. రాము ఇక్క‌డ టీడీపీ జెండాను ఎగుర‌వేశారు. ఆ త‌ర్వాత‌.. క్షేత్ర‌స్థాయిలో ప‌నులు చేప‌ట్టారు. ప‌ర్యావ‌ర‌ణ అనుకూల గుడివాడ‌గా తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. పార్కుల ఏర్పాటు, ర‌హ‌దారుల నిర్మాణం, వంతెన‌ల నిర్మాణాలు కూడా చేప‌ట్టారు.

అయితే.. ఆయా ప‌నుల్లో భారీ ఎత్తున అవినీతి జ‌రుగుతోంద‌న్న‌ది కొడాలి వ‌ర్గం చేస్తున్న ఆరోప‌ణ‌. ఇటీవ ల పేర్ని నాని.. ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టి స‌ర్ ప్రక్రియ‌పై వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు శిక్ష‌ణ ఇచ్చే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా గుడివాడ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. గ‌తంలో గుడివాడ‌లో ఒక్క‌రూపాయి అవినీతి కూడా జ‌ర‌గ‌లేద‌ని,, కానీ.. ఇప్పుడు మాత్రం ఏ ప‌నిచేయాల‌న్నా.. అవినీతి ప‌రుల‌కు చేతులు త‌డ‌పాల్సివ‌స్తోంద‌ని ఎమ్మెల్యే రాముపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

అనంత‌రం.. రాము స్పందిస్తూ.. త‌ను చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను చూసి మాట్లాడాల‌ని, కేవ‌లం రెండేళ్ల వ్య‌వ‌ధిలో చాలా ప‌నులు చేప‌ట్టామ‌ని.. ఒక్క‌రూపాయి కూడా ఎవ‌రి నుంచి ఆశించ‌లేద‌న్నారు. తానే చాలా డ‌బ్బులు ఖ‌ర్చు చేశాన‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే తాను అవినీతికి, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్టు నిరూపించాల‌ని స‌వాల్ రువ్వారు. ఎవ‌రు వ‌చ్చినా.. తాను సిద్ధ‌మేన‌ని గ‌తంలో జ‌రిగిన అవినీతి, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అభివృద్ధిపై చ‌ర్చ‌కు తాను సిద్ద‌మేన‌న్నారు. అయితే.. రాము స‌వాల్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.