తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆమె వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్కు మద్దతుగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. జగన్కు మద్దతుగా.. అదేసమయంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా కవిత వ్యాఖ్యానించారు. జగన్ ప్రకటించిన మావిగన్ రాజధాని కూటమి ప్రభుత్వానికి కంటిపై కునుకు లేకుండా చేస్తోందన్నారు. అందుకే.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
అక్కడితో కూడా ఆగకుండా.. చుక్కనీరు పడితేనే ప్రస్తుత రాజధాని అమరావతి నిండామునుగుతోందన్నారు. ఆ నీళ్లు సెక్రటేరియెట్ను కూడా ముంచెత్తి.. సీఎం చంద్రబాబు సీటు కిందకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉందన్నారు. అలా జరగకుండా ఆయన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణలో ఏర్పాటు చేసిన ఏపీ వాళ్ల విగ్రహాలను తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. చుట్టబెట్టి ఏపీకి పార్సిల్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వైసీపీ అధినేత జగన్కు కవిత మద్దతు ఇస్తున్నారా? ఆయనకు అండగా ఉండాలని భావిస్తున్నారా? అని కొందరు వ్యాఖ్యానించారు.
అసలు చెల్లిపోయి.. కొసరు చెల్లి వచ్చింది.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. జగన్కు మద్దతిచ్చిన కేసీఆర్ బాట లోనే కవిత కూడా నడుస్తున్నారని.. కొత్తేమీ లేదని.. అందరూ ఆ తాను ముక్కలేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ సమస్యలపై చర్చించకుండా.. ఏపీ రాజధాని గురించి ఎందుకని కవితపై మరికొందరు వ్యాఖ్యలు చేశారు.
కవితకు సబ్జెక్టు దొరకట్లేదా? అని ఒకరు వ్యాఖ్యానించారు. అమరావతి మునిగినా.. ఫర్వాలేదు.. చంద్రబాబు ఉన్నారు కాపాడుకునేందుకు.. కవిత మునగకుండా ఉండాలంటే.. కేంద్రమే దిక్కు అంటూ.. పరోక్షంగా లిక్కర్ కేసును ప్రస్తావించారు ఒకరిద్దరు. ఇలా.. సామాజిక మాధ్యమాల్లో కవిత చేసిన వ్యాఖ్యలపై సెటర్లు పడుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates