పాలన… ప్లానింగ్… బాగున్నాయి లోకేష్

పాల‌న విష‌యంలో మంత్రి లోకేష్ ప‌క్కా ప్లానింగ్‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. రాజ‌కీయాల‌ను విధాన‌ప‌ర‌మైన అంశాల‌ను క‌ల‌గాపుల‌గం చేయ‌కుండా.. ఎవ‌రి పాత్ర వారు పోషించేలా ఆయ‌న ప‌క్కా ప్లానింగ్‌తో వ్య‌వ‌హరిస్తున్నారు.

గ‌త రెండేళ్లుగా మంత్రి లోకేష్ తీరును ప‌రిశీలిస్తున్నా.. ఆయ‌న నిర్వ‌హిస్తున్న శాఖ‌ల అధికారుల ప‌నితీరును ప‌రిశీలిస్తున్నా.. ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. రాజ‌కీయ విమ‌ర్శ‌ల విష‌యంలో త‌న పాత్ర‌ను త‌గ్గించుకోకుండా.. ఎప్ప‌టికప్పుడు దూకుడుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ చేసే విమ‌ర్శ‌ల‌కు ఆయ‌న స్పందిస్తున్నారు.

ఇక‌, పాల‌నాప‌ర‌మైన అంశాల్లో తాను ఎంత వ‌ర‌కు ఉండాలో అంత వ‌ర‌కు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కీల‌క అంశాల‌పై వివ‌ర‌ణ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌తాధికారుల‌కే వ‌దిలేస్తున్నారు. త‌ద్వారా టెక్నిక‌ల్ అంశాలు.. విధాన‌ప‌ర‌మైన అంశాల విష‌యంలో క్లారిటీ ఇచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

వాస్త‌వానికి ఒక విష‌యంపై వివాదం ఏర్ప‌డితే.. మంత్రిగా ఆయ‌న స‌మాధానం చెప్పేందుకు అవ‌కాశం ఉంది. కానీ, విధాన‌ప‌ర‌మైన అంశాలు కావ‌డంతో సంబంధిత ఉన్న‌తాధికారులు దానిపై స్పందిస్తే.. స్ప‌ష్ట‌త వ‌స్తుంది. ఇదేసూత్రాన్ని మంత్రిగా నారా లోకేష్ ఫాలో అవుతున్నారు.

గ‌తంలోను ఇప్పుడు కూడా.. విద్యాశాఖ‌కు సంబంధించి రెండు అంశాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం ఎంత మందికి అంద‌లేద‌న్న విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చి.. ఓ వ‌ర్గం మీడియాలో పెద్ద ఎత్తున వ్య‌తిరేక వార్త‌లు వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో రాజ‌కీయం-విధాన‌ప‌ర‌మైన అంశాల‌ను క‌లిపి చూడ‌కుండా.. ఒక‌వైపు రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు తాను చెక్ పెడుతూనే.. విధాన‌ప‌ర‌మైన సందేహాలు, అనుమానాల‌కు అధికారుల‌తో వివ‌ర‌ణ ఇప్పించారు. దీంతో స‌రైన స‌మాచారం ప్ర‌జ‌ల‌కు చేరింది. ఇది వివాదాల‌కు ముగింపు ప‌లికేలా ప‌నిచేసింది.

తాజాగా డీఎస్సీ వ్య‌వ‌హారంపైనా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అన‌ర్హుల‌కు ఉద్యోగాలు ఇచ్చారంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు కూడా చోటు చేసుకున్నాయి. దీనిపై మంత్రిగా తాను వివ‌ర‌ణ ఇస్తే.. దానిని రాజ‌కీయంగా చూసేందుకు.. త‌మ‌కు అనుకూలంగా వాడుకునేందుకు ప్ర‌త్య‌ర్థులు సిద్ధంగా ఉన్న విష‌యాన్ని గుర్తించిన మంత్రి.. విధాన‌ప‌ర‌మైన అంశం కావ‌డంతో పాఠ‌శాల విద్యాశాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శితోనే మీడియాకు వివ‌ర‌ణ ఇచ్చారు.

దీంతో ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న సందేహాల‌కు ముగింపు ప‌లికిన‌ట్టు అయింది. ఇక, నంద్యాలలో వైఎస్ విగ్ర‌హ ధ్వంసం వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు. తానే స్వ‌యంగా జోక్యం చేసుకున్నారు. ఇది రాజ‌కీయం కావ‌డంతో తానే జోక్యం చేసుకుని ముగింపు ప‌లికే ప్ర‌య‌త్నం చేశారు.