బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణలో బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి అనంతరం టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త టీపీసీసీ చీఫ్ ఎవరన్నదానిపై కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు మల్లగుల్లాలు పడ్డారు. టీపీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి ముందుండగా….మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి తర్వాతి స్థానంలో ఉన్నట్లు ప్రచారం జరిగింది.

అయితే, కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ వైపు మొగ్గు చూపుతుందన్న పుకార్ల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో చేరతారని వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వెంకటరెడ్డి సోదరుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను బీజేపీలో చేరబోతున్నట్టు రాజగోపాల్ రెడ్డి షాకింగ్ ప్రకటన చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ఈ నిర్ణయాన్ని మీడియాకు వెల్లడించారు.

తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని తాను చాలా రోజుల క్రితమే చెప్పానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, టీఆర్ ఎస్ ను దీటుగా బీజేపీ ఎదుర్కోగలదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఒంటెత్తు పోకడలు మానుకోవాలని, ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలని అన్నారు. సీఎం జగన్ తండ్రికి తగ్గ కొడుకు కావాలని అభిలషిస్తున్నట్టు రాజగోపాల్ రెడ్డి అన్నారు.

తాను మాత్రమే బీజేపీ తీర్థం పుచ్చుకున్నానని చెప్పిన రాజగోపాల్ రెడ్డి….కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని చెప్పారు. తామిద్దరం వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ…అన్నదమ్ములగా కలిసిమెలిసి ఉంటామన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి ఎవరిని వరిస్తుందన్న దానిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర సమాధానమిచ్చారు. కొత్త అధ్యక్షుడు ఎవరన్న ప్రశ్నకు కాలమే సమాధానమిస్తుందన్నారు. తాజాగా, రాజగోపాల్ రెడ్డి నిర్ణయంతో టీపీసీసీ చీఫ్ గా ఎవరిని నియమించాలన్న విషయంపై కాంగ్రెస్ అధిష్టానం వైఖరిలో మార్పు ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.