ఎమ్మెల్యేల‌పై రేవంత్ ఆవేద‌న…

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప‌నితీరుపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. పార్టీలో అంత‌ర్గ‌త ప‌రిస్థితిని స్ప‌ష్టం చేస్తున్నాయి. ఎమ్మెల్యేలు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌మీందార్ల మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇదేమీ చిన్న విషయం కాదు. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవ‌డం లేద‌ని.. ప్ర‌త్యేక సామ్రాజ్యాల‌ను నిర్మించుకున్న‌ట్టుగా ఫీల‌వుతున్నా రని.. గ‌తంలోనూ సీఎం వ్యాఖ్యానించారు.

ఎప్ప‌టిక‌ప్పుడు..

వాస్త‌వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల‌కు ముందు.. అదేవిధంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముందు కూడా.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌పై సీఎం రేవంత్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఆ రెండు సంద‌ర్భాల్లోనూ ఆయ‌న క‌లివిడిత‌నంపై ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. ఎమ్మెల్యేల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేద‌ని.. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవ‌డం లేద‌ని.. బీఆర్ ఎస్ స‌హా.. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను బ‌లంగా తిప్పికొట్ట‌లేక పోతున్నార‌ని కూడా వ్యాఖ్యానించారు.

ఈ క్ర‌మంలోనే అప్ప‌ట్లో ఆయ‌న కొన్ని సూచ‌న‌లు చేశారు. అయితే.. వాటిని పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోలే దు. నిజానికి వారంలో ఒక రోజు ప‌ల్లె నిద్ర చేయాల‌ని గ‌తంలోనే చెప్పినా.. ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా చెవిని ఎక్కించుకోలేదు. ఇక‌, ఇప్పుడు రెండున్న‌రేళ్ల త‌ర్వాత ఎమ్మెల్యేలపై మ‌రోసారి రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీని వెనుక ప‌లు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. పైకి చెబుతున్న‌వి కొన్నే అయినా.. తెర వెనుక ఉన్న కార‌ణాలు మ‌రిన్ని ఉన్నాయ‌ని అంటున్నారు.

1) నియోజ‌క‌వ‌ర్గాల్లో భూక‌బ్జాల ఆరోప‌ణ‌లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ వాద‌న ఎక్కువ‌గా ఉంది.

2) అవినీతి ప్ర‌బ‌లింద‌న్న‌ది వాస్త‌వం. ఏసీబీకి వ‌స్తున్న ఫిర్యాదుల్లో సింహ‌భాగం ప్ర‌జాప్ర‌తినిధుల‌పైనే ఉన్నాయ‌న్న‌ది ఇటీవ‌ల అంత‌ర్గ‌త స‌మావేశంలోనూ చ‌ర్చ‌కు వ‌చ్చింది.

3) కొన్ని చోట్ల బీఆర్ ఎస్ నాయ‌కులతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేతులు క‌లిపి పనులు చేస్తున్నారు. ఇది మ‌రింత ప్ర‌మాదంగా మారిపోయింది.

4) ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఆరు గ్యాంరెటీల‌పై ఎవ‌రూ పెద‌వి విప్ప‌డం లేదు. ప్ర‌చారం కూడా చేయ‌డం లేదు.

5) ప్ర‌భుత్వానికి స‌మాంత‌రంగా నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలో కూడా.. ప్ర‌భుత్వాలు న‌డుపుతున్న ఎమ్మెల్యేల సంఖ్య నానాటికీపెరుగుతోంది. దీనిపై కూడా సీఎం ఆవేద‌న‌తోనే ఉన్నారు.

6) పోలీసు-రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ల‌ను కొంద‌రు ఎమ్మెల్యేలు త‌మ చెప్పు చేత‌ల్లో పెట్టుకున్నార‌ని.. దీంతో ప్ర‌తిప‌నికీ.. ఇంత‌ని రేటు క‌డుతున్నార‌న్న విమ‌ర్శ‌లు గ‌త ఏడాదికాలంగా జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే సీఎం రేవంత్‌.. త‌న పార్టీఎమ్మెల్యేల‌ను ఉద్దేశించి జ‌మీందార్లు అనే మాట వినియోగించారు. మ‌రి ఇప్పటికైనా మారుతారా? అనేది చూడాలి.