కాలుష్యం విషయంలో పవన్ కాంప్రమైజ్ అవ్వరు బ్రో

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న అక్కడి ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కాలుష్య కాసారాలుగా మారిన ప్ర‌ధాన కాలువ‌ల నుంచి వ‌చ్చే నీరు ప‌విత్ర గోదావ‌రి న‌దిలో క‌లుస్తుండ‌డాన్ని గ‌మ‌నించారు. వాస్త‌వానికి.. అధికారులు ఈ స‌మ‌యంలో అంతా బాగానే ఉంద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌గా.. క్షేత్ర‌స్థాయిలో న‌డుస్తూ.. ప‌రిస్థితుల‌ను తెలుసుకున్న ప‌వ‌న్‌.. కాలుష్యంపై క‌న్నెర్ర చేశారు.

గోదావ‌రి నదిలోకి వ‌స్తున్న క‌లుషిత జ‌లాల అస‌లు మూలం ఎక్క‌డుంద‌ని ప్ర‌శ్నించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఆంధ్రా పేప‌ర్ మిల్స్ స‌హా.. ప‌లు ప్రైవేటు కంపెనీల నుంచి కూడా క‌లుషితాలు వ‌చ్చి.. న‌దిలో క‌లుస్తున్నాయ‌ని తెలుసుకుని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వాళ్ల‌ను క‌ట్ట‌డి చేయ‌లేమా? అని ప్ర‌శ్నించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. `ఎంత స్థితిమంతులైనా వ‌ద‌ల‌ను“ అని వ్యాఖ్యానించారు. కాలుష్య కార‌కాల‌ను శుభ్రం చేయాలని ఆదేశించారు.

అదేస‌మ‌యంలో కాలుష్యాన్ని న‌దుల్లోకి వ‌దులుతున్న కంపెనీల‌కు.. త‌క్ష‌ణ‌మే ప‌ర్యావ‌ర‌ణ చ‌ట్టాల ప్ర‌కారం.. నోటీసులు ఇవ్వాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదేశించారు. ఎంత‌టి వారినైనా ఉపేక్షించవ‌ద్ద‌ని అధికారుల‌కు తేల్చి చెప్పారు. గోదావరి కాలుష్య నివారణకు టాస్క్‌ఫోర్స్‌ అనే ప్ర‌త్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఈ టాస్క్ ఫోర్సుకు అధికారులు స‌హ‌క‌రించి.. వివ‌రాలు ఇవ్వాల‌ని.. గోదావ‌రి నీటిని క‌లుషితం చేస్తే ఒప్పుకొనేది లేద‌ని తేల్చి చెప్పారు.

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న గోదావ‌రి పుష్క‌రాల‌ను తానేస్వ‌యంగా పర్య‌వేక్షిస్తాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఈ క్ర‌మంలో గోదావరి పుష్క‌రాలు జ‌రిగే ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. అధికారుల‌తో కూర్చొని స‌మీక్ష లు చేయ‌డం కాకుండా.. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తున్నారు. ప‌రిస్థితిని నేరుగా తెలుసుకుంటున్నారు. అక్క‌డిక‌క్క‌డే అధికారుల‌కు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాగా.. ఏపీలో అత్యంత కాలుష్య కార‌కాల‌న్నీ గోదావ‌రి న‌దిలోకే వ‌స్తున్నాయ‌ని.. ఇటీవ‌ల కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ సైతం ఒక నివేదిక‌లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం.