వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఫిర్యాదుల స్వీకరణను మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ మాదిరిగా ఓ భారీ కార్యక్రమమే నడిచింది.
జగన్ కు తమ సమస్యలను చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలోనే జనం వచ్చారు. వీరిలో జగన్ కు ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన వారి కంటే జగన్ ను కలిసి ఆయనతో ఫొటోలు తీసుకునేందుకు వచ్చిన వారే అధికంగా ఉన్నారని చెప్పాలి.
జనంలో జగన్ కు ఓ రేంజిలో ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఈ కారణంగానే జగన్ ఎక్కడికి వెళ్లినా… జనం ఆయనను చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. తాజాగా జగన్ తాడేపల్లిలో ఉన్నారన్న విషయం తెలిసిన చాలా మంది ఆయనను చూసేందుకే తాడేపల్లి ఆఫీసుకు వచ్చారు.
తనను కలిసేందుకు వచ్చిన జనాన్ని కలిసేందుకు జగన్ కూడా ఓ మోస్తరు సమయమే కేటాయించినట్లు చెప్పాలి. తాడేపల్లి కార్యాలయానికి వచ్చిన వారిలో దాదాపుగా అందరినీ జగన్ కలిసినట్టుగా చెబుతున్నారు.
సీఎంగా ఉన్న సమయంలో దాదాపుగా తాడేపల్లిలోనే ఉండిపోయిన జగన్… సీఎం కుర్చీ దిగిన తర్వాత తాడేపల్లికి చుట్టపు చూపుగానే వస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అదిక సమయం బెంగళూరులోని తన పాలెస్ లో గడుపుతున్న జగన్… ఈ మధ్యే కొంతకాలం పాటు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కూడా ఉంటున్నారు.
ఈ క్రమంలోనే వారంలో కేవలం ఒకటి అరా రోజులు మాత్రమే ఆయన తాడేపల్లిలో ఉంటున్నారు. దీంతో ఆయనను చూడాలనుకునే వైసీపీ శ్రేణులతో పాటు జగన్ తో ఫొటో దిగాలనుకునే ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తాడేపల్లికి వస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే మంగళవారం జనంతో తాడేపల్లి కార్యాలయం కిటకిటలాడిందని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates