జగన్ రైటు… జనమే రాంగా?

ఏపీ రాజ‌ధాని విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌క్కా క్లారిటీతోనే ఉన్నారా? అంటే.. ఔన‌నే ఆయ‌న చెబుతున్నారు. ప్ర‌జ‌లు మెచ్చుతారా.. గిచ్చుతారా.. అనే వాద‌న‌తో సంబంధం లేకుండా.. మ‌రోసారి ఆయ‌న నోటి వెంట మావిగ‌న్‌(మ‌చిలీప‌ట్నం-విజ‌య‌వాడ‌-గుంటూరుతో కూడిన రాజ‌ధాని) మాటే వినిపించింది. రాజ‌ధాని అమ‌రావ‌తికి .. ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను వృధా చేస్తున్నార‌ని.. అస‌లు ఎప్ప‌టికీ రాజ‌ధాని అనేది లేకుండా చేస్తున్నార‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 14 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌భుత్వం అప్పులు చేసింద‌ని.. భ‌వ‌నాల‌కు భారీ ఎత్తున చెల్లించి.. కాంట్రాక్ట‌ర్ల‌ను పోషిస్తున్నార‌ని తెలిపారు. హైద‌రాబాద్‌లో అప్ప‌టి కేసీఆర్ ప్ర‌భుత్వం నిర్మించిన స‌చివాల‌యానికి కూడా ఇంత పెద్ద ఎత్తున కాంట్రాక్ట‌ర్ల‌కు ఇవ్వ‌లేద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం రాజ‌ధానికి ఇస్తున్న సొమ్ము ఎటు పోతోంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అభివృద్ధి చెందిన మావిగ‌న్‌ను రాజ‌ధానిగా చేసుకుంటే.. ఐదేళ్ల‌లో మ‌రింత‌గా అభివృద్ధి చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

సో.. దీనిని బ‌ట్టి..జ‌గ‌న్‌.. రాజ‌ధాని విష‌యంలో మావిగ‌న్‌పై ప‌క్కా క్లారిటీతో ఉన్నారు. అంతేకాదు.. ముందు .. దీనిని కొంద‌రు వ్య‌తిరేకించార‌ని.. వ్యంగ్యంగా కూడా మాట్లాడార‌ని ఆయ‌న అన్నారు. కానీ, ఇప్పుడు.. భారీ ఎత్తున త‌మ మాట‌కు ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు వ‌స్తోంద‌ని చెప్పారు. అన్నీ ఆలోచించే మావిగ‌న్ ప్ర‌కట‌న చేశామ‌న్నారు. చంద్ర‌బాబు చెబుతున్న అమ‌రావతి ఎప్ప‌టికీ పూర్తి కాద‌ని.. దాని వ‌ల్ల రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టికీ రాజ‌ధాని అందుబాటులోకి రాద‌ని కూడా తేల్చి చెప్పారు.

ప్ర‌జ‌లు ఏం చేస్తారు

ఇక‌, జ‌గ‌న్ నిర్ణ‌యం ఇంత ప‌క్కాగా ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడు తేల్చుకోవాల్సింది.. ప్ర‌జ‌లేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను గెలిపిస్తే.. జ‌రిగేది ఏంటో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు క‌నిపిస్తున్న‌ద‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు కూడా ఒక క్లారిటీకి రావాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. గత ఎన్నిక‌ల‌కు ముందు మూడు రాజ‌ధానులు అన్న జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లు ఇంటి బాట ప‌ట్టించారు. ఇప్పుడు మావిగ‌న్ నినాదం అందుకున్నారు. ఇక‌, అంతా ప్ర‌జ‌ల చేతిలోనే ఉంద‌ని చెబుతున్నారు.