బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై పోస్కో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే దేశ చట్టాలను గౌరవించిన బండి ఫ్యామిలీ భగీరథ్ ను పోలీసుల ఎదుట హాజరు పరచింది.
కుమారుడు చేసిన తప్పునకు తండ్రి రాజీనామా చేయాలంటూ వైరి వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు చెందిన ఓ ఎంపీ మద్దతుగా నిలిచారు. ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్, ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మల్లు రవి ఏమన్నారన్న విషయానికి వస్తే… మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాగంగా బండి భగీరథ్ విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. భగీరథ్ చేసిన తప్పునకు అతని తండ్రి రాజీనామా చేయాల్సిందేనని బీఆర్ఎస్ చేస్తున్న డిమాండ్ ను వారు ప్రస్తావించారు.
ఈ విషయాలు విన్నంతనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మల్లు రవి.. ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తేల్చి పారేశారు. లిక్కర్ కేసులో కవిత అరెస్టు అయితే కేసీఆర్ రాజీనామా చేశారా? కేటీఆర్ రాజీనామా చేశారా? హరీశ్ రావు రాజీనామా చేశారా? అని ఆయన ప్రశ్నించారు.
అయినా మనిషి అన్నాక కొన్ని బంధాలు ఉంటాయని మల్లు రవి గుర్తు చేశారు. నేతలన్నాక వారికి పిల్లలుంటారు కదా. పిల్లలు తెలిసో, తెలియకో తప్పు చేస్తే నేతలను రాజీనామా చేయాలని కోరడం సబబు కాదని ఆయన అన్నారు. ఈ విషయం ఏ పార్టీ నేతలకైనా వర్తిస్తుందన్నారు. సదరు నేత బీజేపీకి చెందినవారైనా, కాంగ్రెస్ కు చెందిన వారైనా, బీఆర్ఎస్ కు చెందిన వారైనా.. ఎవరికైనా ఇదే వర్తిస్తుందని చెప్పారు. పిల్లలు చేసిన తప్పులకు తల్లిదండ్రులను బాధ్యులను చేయడం సబబు కాదని ఆయన తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.
ఇక ఆ మంత్రి విషయాన్ని నేరుగానే ప్రస్తావించిన రవి… అసలు ఆయన ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. బండి సంజయ్ కుమారుడు తప్పు చేశారో, లేదోనన్న విషయాన్ని పక్కనపెడితే… బాధ్యత గల పౌరుడిగా, ఓ కేంద్ర మంత్రిగా తన కుమారుడిని పోలీసులకు అప్పగించినప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు.
పిల్లలు అప్పుడప్పుడు తప్పులు చేసే అవకాశం ఉంటుందన్న రవి… నిందితుడిని పోలీసులకు పట్టించకుండా ఉంటే సంజయ్ ని తప్పుబట్టేవారమని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates