ఏపీ అంటే… అడ్వాన్స్ డ్ ప్రదేశ్!

నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత ముందుగానే అంచనా వేసే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లాంటి నేత ఏపీకి ముఖ్యమంత్రిగా ఉంటే… రాష్ట్రం అన్నింటా ముందే ఉంటోంది. అందుకే ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదని, అడ్వాన్స్ డ్ ప్రదేశ్ అని అంటున్నారు. ఇదేదో… టీడీపీ నేతలో, చంద్రబాబు అభిమానులో చెబుతున్న మాట ఎంతమాత్రం కాదు. సాక్షాత్తు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పిన మాట ఇది.

ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న అడ్వాన్స్ డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఏఎ:సీఏ) ప్రాజెక్టుకు చంద్రబాబుతో కలిసి రాజ్ నాథ్ శంకుస్థాపన చేశారు. రూ.15,800 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా 750 మందికి ఉపాధి లబించనుంది.

భారత రక్షణ శాఖ తయారు చేసే ఫైటర్ జెట్లను పరీక్షించేందుకు ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నా… రక్షణ శాఖ ఏపీకే ఇందుకు ఎంచుకుంది. అందులోనూ కరువు సీమ రాయలసీమలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసేలా చంద్రబాబు సర్కారు కేంద్రాన్ని ఒప్పించింది. ఈ సందర్భంగా ప్రసంగించిన రాజ్ నాథ్.. చంద్రబాబు విజన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భవిష్యత్తును ముందుగానే అంచనా వేసే సామర్థ్యం చంద్రబాబులో ఉందన్న రాజ్ నాథ్… సాంకేతికతపై ఫ్యాషన్ తో పాటు అభివృద్ధిపై కమిట్ మెంట్ చంద్రబాబు సొంతమని అన్నారు. ఈ తరహా చంద్రబాబు వైఖరి భారత్ లోనే కాకుండా అంతర్జాతీయ వేదికల మీద కూడా చాలాసార్లు నిరూపితమైందని ఆయన చెప్పుకొచ్చారు.

చంద్రబాబు పనితీరుకు మంచి గుర్తింపు లభించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గూగుల్ వంటి కంపెనీలు తమ ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఏపీనే ఎంచుకోవడానికి చంద్రబాబే కారణమని ఆయన అన్నారు. చంద్రబాబు కారణంగా ఇప్పుడు ఏపీ అన్నింటా ముందు వరుసలో దూసుకుపోతోందన్న రాజ్ నాథ్.. అందుకే ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదని అడ్వాన్స్ డ్ ప్రదేశ్ అని చెప్పారు.