జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురువారం అమరావతి చేరుకున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ మేరకు కేబినెట్ భేటీకి పవన్ హాజరైన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ పెద్దగా విరామం ఏమీ తీసుకోకుండానే ఏపీ ప్రజలు తనకు అప్పగించిన బాధ్యతల్లోకి ఒరిగిపోయారు. ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి పవన్ కేబినెట్ భేటీకి హాజరైనట్లుగా డిప్యూటీ సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
శ్వాస సంబంధిత సమస్యలతో గత కొంతకాలంగా సతమతమైన పవన్… ఆ సమస్య మరింత పెద్దదిగా మారే ప్రమాదం ఉండటంతో వైద్యుల సలహా మేరకు ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆపరేషన్ చేయించుకుని హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ను సీఎం చంద్రబాబు ఇటీవలే పరామర్శించారు. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా పవన్ ఇంటికి వెళ్లారు. పవన్ అనారోగ్యంపై ఆరా తీసిన మోదీ… పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రధాని మోదీ తన ఇంటికి వచ్చిన సందర్భంగానూ పవన్ ఓ మోస్తరు అలసటతోనే కనిపించారు. నాటి ఫొటోలు చూసిన వారంతా… పవన్ ఇంకా కోలుకోలేదని భావించారు. అయితే అందరికీ షాకిస్తూ గురువారం పవన్ హైదరాబాద్ నుంచి నేరుగా అమరావతి చేరుకున్నారు. మునుపటి మాదిరే ఉత్సాహంగా కనిపించిన పవన్.. కేబినెట్ బేటీలో కీలక అంశాలపై ఆసక్తికర చర్చలు చేశారు. మొత్తంగా తన ఆరోగ్యంపై రేకెత్తుతున్న ఆందోళనలను పవన్ ఒక్క దెబ్బతో కొట్టిపారేశారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates