కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు. వదిలి పెట్టదు అని రాసిన పోస్టర్లు.. దాదాపు తిరువనంతపురంలోని అన్ని కూడళ్లలోనూ కనిపించాయి. ముఖ్యంగా వయనాడ్ ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా మీరు పట్టించుకోవడం లేదని కొందరు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మీకు సంచులు మోసే కేసీ వేణుగోపాల్ కూడా మిమ్మల్ని కాపాడరు.. అని వ్యాఖ్యానించడం గమనార్హం.
ఏం జరిగింది?
కేరళ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి.. రిజల్ట్ కూడా వచ్చేసి దాదాపు 10 రోజులు అయినప్పటికీ.. ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. 140స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూడీఎఫ్ కూటమి 102 స్థానాల్లో విజయం దక్కించుకుంది. అయినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటు ఇప్పటి వరకు సైలెంట్గానే ఉంది. దీనికి కారణం ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి ఇంకా ఒక నిర్ణయం తీసుకోకపో వడమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్నాయకులు, కార్యకర్తల్లో అసహనం పెల్లుబుకుతోంది.
ప్రధానంగా ప్రజలు కోరుకుంటున్న సతీశన్ను కాదని.. రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్కు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై పార్టీలు వర్గాలు మండిపడుతున్నాయి. అంతేకాదు.. యూడీఎఫ్లో 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ఐయూఎంఎల్ పార్టీ కూడా సతీశన్కే మద్దతుగా ఉంది. ఈ నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ను ఎంపిక చేస్తున్నారన్న వ్యవహారంపై అన్ని పక్షాల్లోనూ వ్యతిరేకత కనిపిస్తోంది.
మరోవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయంపై ఇంకా ఎటూ తేల్చకుండా వ్యవహరించడం.. ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేయడమేనన్న వాదన కూడా ప్రబలుతోంది. ఈ క్రమంలో రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ.. కొందరు ప్లకార్డులు ప్రదర్శించడం.. పార్టీ కార్యాలయాల ముందే నిరసన పోస్టర్లు అంటించడం.. సంచలనంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates