హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో కలిస్తే.. గుజరాత్కు పదేళ్లలో ఎంతిచ్చానో.. అంతా తెలంగాణకు కూడా ఇస్తా అంటూ.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రధాన మంత్రి బహిరంగ వేదికపైనే ప్రకటించారు. దీనిలో అంతరార్థం ఏంటనేది సుస్పష్టంగానే ఉంది. గతంలో కాంగ్రెస్ నాయకుడిగా ఉండి.. అస్సాంలో పార్టీని డెవలప్ చేసిన హిమంత బిశ్వశర్మను కూడా.. అప్పట్లో ప్రధాని ఇలానే ఆకర్షించారు.
అస్సాంలో జరిగిన సమావేశంలో తొలినాళ్లలో ప్రధానిగా ఉన్నప్పుడు.. మోడీ మాట్లాడుతు.. మాపై విరుచుకుపడడం కాదు.. మాతో చేతులు కలిపితే.. ఉండే ప్రయోజనం వేరుగా ఉంటుంది. అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత.. కాంగ్రెస్ పార్టీ తనను అవమానించిందంటూ.. బిశ్వశర్మ కాషాయం గూటికి చేరిపోయారు.
రెండోసారి మంగళవారం ఆయన అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇక్కడే కాదు.. పలు రాష్ట్రాల్లోనూ ఇదే జరిగింది. మహారాష్ట్రలో శివసేనను చీల్చి ఏక్నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చారు. ఇప్పుడు ఇలానే తెలంగాణలోనూ ఏదో ఆశిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
ఇలాంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేంద్రంతో కలిసి నడిచేందుకు ఎప్పుడూ సిద్ధమేనని ఆయన చెప్పారు. కానీ.. అది మోడీతో కాదన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా.. కేంద్రంతో కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
మోడీ వ్యాఖ్యలను ఇంతకు మించి వేరేగా చూడాల్సిన అవసరం లేదని హితవు పలికారు. కేంద్రంతో కలిసి.. అభివృద్ధి సాధించడంలో తప్పేముందన్నారు. ప్రతిసారీ కయ్యాలకు కాలు దువ్వితే.. అది రాష్ట్రానికే మంచిది కాదన్నారు. తాము ఆది నుంచి కూడా కేంద్రానికి సహకరించాలనే ధోరణితోనే ముందుకు సాగుతున్నట్టు రేవంత్ రెడ్డి వెల్లడించారు.
అంతేకాదు.. ప్రధాన మంత్రిని 2 గంటల సమయం కోరుతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన ఆ సమయం తమకు కేటాయిస్తే.. రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలని భావిస్తున్నామో.. ఆయా విషయాలను ఆయనకు సమగ్రంగా వివరిస్తామని చెప్పారు.
రైజింగ్ తెలంగాణ ద్వారా రాష్ట్రానికే కాకుండా.. కేంద్ర ప్రభుత్వానికి, దేశానికి కూడా మంచి పేరు వస్తుందన్నారు. ఈ విషయంలో మాత్రమే కేంద్రంతో తాము కలిసి నడుస్తామని.. ప్రధాని వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని అన్నారు. మోడీతో వ్యక్తిగతంగా.. రాజకీయంగా కలవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates