అంబానీకి రైతు ఉద్యమ సెగ

అటు తిరిగి ఇటు తిరిగి రైతుల ఉద్యమసెగ అంబానీకి గట్టిగానే తగులుతోంది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ తో పంజాబ్, హర్యానా, మహారాష్ట్రలోని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గడచిన 34 రోజులుగా ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘూ ప్రాంతంలో రైతులు చేస్తున్న ఉద్యమసెగ యావత్ దేశమంతా పాకుతోంది.

రైతుల ఉద్యమాన్ని ఎలాగైనా మాన్పించాలని కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న సాధ్యం కావటం లేదు. ఎందుకంటే నూతన వ్యవసాయ చట్టాలను రద్ద చేయటానికి కేంద్రప్రభుత్వం సిద్ధంగా లేదు కాబట్టి. కేంద్రం చేసిన చట్టాలు అంబానీలు, అదానీల ప్రయోజనాల కోసమే అనేది రైతుసంఘాల ఆరోపణ. ఇందుకు తగ్గట్లే ఉత్తరాధిలోని చాలా చోట్ల ఏర్పాటు చేస్తున్న కోల్డుస్టోరేజీలు అదాని కంపెనీలవనే ప్రచారం ఊపందుకుంది. దాంతో రైతులు రగిలిపోతున్నారు.

టవర్ల ధ్వంసం…

సో కేంద్రప్రభుత్వం మీద కోపమంతా అంబనీలు, అదానీలపై మళ్ళింది. అందుకనే పంజాబులో జియో టెలికాం టవర్లపై రైతులు చూపించారు. జియో టెలికం కంపెనీకి ఉన్న టవర్లలో 1500 టవర్లను రైతులు ధ్వంసం చేశారు. మొత్తం మీద 9 వేల టవర్లపై రైతులు, రైతు సంఘాలు, స్ధానికులు దాడులు చేశారు. ఈ 9 వేల టవర్లలో కొన్నింటిని ధ్వంసం చేయటం, మరికొన్నింటికి విద్యుత్ తదితర కనెక్షన్లను పీకేయటం, మరికొన్నింటి రిసీవర్లను + జనరేటర్లను ఆందోళణకారులు పగలగొట్టేశారు.

ప్రభుత్వం సీరియస్

రోజురోజుకు టెలికాం టవర్లపై పెరిగిపోతున్న దాడుల విషయమై ప్రభుత్వం సీరియస్ అయిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయటం మంచిది కాదని సీఎం అమరేందర్ సింగ్ రైతులకు విజ్ఞప్తి చేశారు. ఆస్తులపై దాడులు చేసే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోమని పోలీసులకు ఆదేశాలిచ్చారు. మొత్తానికి కేంద్రం మీద కోపం కాస్త రిలయన్స్ జియో టవర్లపై ప్రభావం చూపుతోంది.