వచ్చే 2029లో యువతకు పెద్దపీట వేయాలని టీడీపీ నిర్ణయించింది. ముఖ్యంగా సగానికిపైగా స్థానాల్లో యువతకు ప్రాదాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పెద్ద ఎత్తున యువతకు అవకాశం ఇస్తున్న పార్టీగా టీడీపీ అవతరించే అవకాశం ఉంది. ఇదేసమయంలో లెక్కకు మిక్కిలిగా నాయకులను తీసుకునే అవకాశం ఉన్నా.. ఆచి తూచి అడుగులు వేయాలని నిర్ణయించారు. గత రెండు రోజులుగా ఈ విషయంపై పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
సీనియర్లు-జూనియర్లు.. కలగలిపి గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు. వాస్తవానికి అనుకున్న సంఖ్య కంటే కూడా.. యువతకు తక్కువగానే టికెట్లు ఇచ్చారు. కానీ.. ఈ దఫా మాత్రం అనుకున్న సంఖ్యను అనుకు న్నట్టుగా అమలు చేయాలని నిర్ణయించారు. అంటే.. ప్రస్తుతం ఉన్న సీట్లు 175 అలానే కొనసాగితే.. దాదా పు 80కిపైగా స్థానాల్లో కొత్తవారికి.. యువతకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే.. ఎక్కువగా యువత, సామాన్యులే విజయం దక్కించుకున్నారు.
ప్రజలు కూడా సింపతీ కోణంలోనే ఆలోచించిన పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో సింపతీని దూసుకు నేందుకు స్థానికంగా చేతివృత్తులు చేసుకునేవారు.. ప్రజల్లో మంచి ఇమేజ్ ఉన్నవారిని వెతికి పట్టుకుని.. వారికి 10 శాతం టికెట్లు ఇవ్వాలని నిర్నయించుకున్నట్టు బీజేపీ, టీడీపీలు చెబుతున్నాయి. ఎవరికి వారే ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నా.. అంతిమంగా.. ఉమ్మడి నిర్ణయం ప్రకారం ముందుకుసాగాలని నిర్ణయించుకున్నాయి. ఇది పార్టీలకు.. సమాజంలో ఉన్న ప్రజల నాడిని పట్టుకునేందుకు అవకాశం దక్కుతుంది.
ఇక, యువతకు పెద్దపీట వేసే క్రమంలో అందరికీ అవకాశం ఇవ్వకుండా.. వారిలో ఉన్న నాయకత్వ లక్షణాలను ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించి త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రాతిపదికగా తీసుకుని.. ఈ ఫార్ములాను అమలు చేయాలని టీడీపీ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది.
అంటే.. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను క్లస్టర్ల వారీగా విభజించి యువతకు అప్పగిస్తారు. వారు విజయం దక్కించుకుంటే.. అలాంటి వారిలో మెరికల్లాంటి వారిని ఎంపిక చేసి.. అసెంబ్లీకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఏదేమైనా యువతకు అవకాశం అంటే.. దీనికి కూడా ఒక లెక్క ఉంటుందని స్పష్టమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates