‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆకివీడులోని పెదపేటలో రామాలయం పునర్నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే, శాసన సభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు ఆదివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఓ కీలక వ్యాఖ్య చేశారు. రామాలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకుంటామని కొందరు చెబుతున్నారని, అలాంటి వారి నుంచి ఎన్ని రకాలైన అడ్డుంకులు ఎదురైనా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తానని ఆయన తెలిపారు.

పెదపేటలోని రామాలయానికి చెందిన స్థలంలో ఆలయ పునర్నిర్మాణాన్ని చేపట్టే దిశగా ఇటీవలే అక్కడికి వెళ్లిన రఘురామపై ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి యత్నించారు. సదరు స్థలంలో గతంలో రామాలయం లేదని, తాము పూజించేగొంతేనమ్మ ఆలయం ఉండేదని, అక్కడ రామాలయాన్ని నిర్మిస్తామంటే ఊరుకునేది లేదని అక్కడి వారు వాదించారు. ఈ సందర్భంగా జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి గొడవకు కారణమైన వారిని అరెస్టు చేశారు. ఆపై వారు కోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. పరిస్థితి ఎలా ఉన్నా రామాలయం పునర్నిర్మాణం దిశగా రఘురామ వేగంగా అడుగులు వేశారు.

రామాలయం పునర్నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకుండా ఉండేలా సుముహూర్తం పెట్టాలని రఘురామ వేద పండితులను కోరారట. ఈ క్రమంలో మే 3వ తేదీన ఉదయం 7.14 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉందని పండితులు చెప్పారట. అయితే ఈ ముహూర్తంతో పాటుగా మరో ముహూర్తాన్ని కూడా చూడాలని రఘురామ వారిని కోరగా.. మే 3 నాటి ముహూర్తం దివ్యమైనదని, ఆ ముహూర్తానికే రామాలయ పునర్నిర్మాణ శంకుస్తాపన జరిగి తీరుతుందని వారు చెప్పారట. దీంతో రఘురామ ఆదివారం నాటి ముహూర్తానికే ఆలయ పునర్నిర్మాణానికి వేది పండితుల ఆశీర్వచనాల మధ్య శంకుస్తాపన చేశారు.

ఈ సందర్భంగా రఘురామ భావోద్వేగానికి గురయ్యారు. రామాలయానికి చెందిన స్థలంలో ఆలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకునేందకు కొందరు యత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రామాలయాన్ని ఎలా కడతారో చూస్తామని, ఆలయ నిర్మాణాన్ని అడ్దుకుని తీరతామని కొందరు బెదిరిస్తున్నారని కూడా ఆయన అన్నారు.

మరికొందరు ఏకంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారని, ఇంకొందరు కూడా కోర్టులకు వెళతామని చెబుతున్నారని ఆయన అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి తీరతానని ఆయన ప్రకటించారు. ఆలయాన్ని కృష్ణ శిలతో నిర్మిస్తున్నామన్న రఘురామ.. 8 దశాబ్దాల పాటు ఆలయం చెక్కు చెదరకుండా ఉంటుందని తెలిపారు.