చంద్ర‌బాబు వ‌ల్లే ఏపీకి మంచి రోజులు

ఏపీకి చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌డం.. ఇక్క‌డి ప్ర‌జ‌లు చేసుకున్న అదృష్ట‌మ‌ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ కొనియాడారు. ఆయ‌న వ‌ల్లే ఏపీకి మంచి రోజులు వ‌చ్చాయ‌న్నారు. త్వ‌ర‌లోనే విశాఖ‌ప‌ట్నం.. ఐటీ ప‌ట్నం కానుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. విశాఖ‌లోని త‌ర్లువాడ‌లో గూగుల్ ఏఐ డేటా కేంద్రానికి శంకుస్థాప‌న చేసేందుకు వ‌చ్చిన ఆయ‌న‌.. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అనంత‌రం.. నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడుతూ.. సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేష్‌ల‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

ఒక న‌గ‌రాన్ని నిర్మించారు!

సీఎంగా చంద్ర‌బాబు ఒక న‌గ‌రాన్నే నిర్మించార‌ని అశ్వినీ వైష్ణ‌వ్ తెలిపారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఉన్నప్పుడు సైబ‌రాబాద్ న‌గ‌రాన్ని నిర్మించిన విష‌యాన్ని ఆయ‌న చెప్పారు. ఐటీ అభివృద్ధిలో ఈ న‌గరం కీల‌క పాత్ర పోషిస్తోంద‌ని అన్నారు. అంతేకాదు.. భారీ ఆదాయాన్ని కూడా తీసుకువస్తుందని తెలిపారు. బాబు విజ‌న్ ఉన్న నాయ‌కుడ‌ని.. ఆయ‌న‌కు సెల్యూట్ చేస్తున్నాన‌ని వైష్ణ‌వ్ పేర్కొన్నారు. అంతేకాదు.. దేశం గ‌ర్వించే నాయ‌కుడ‌ని చంద్ర‌బాబు కొనియాడారు.

లోకేష్ ఎన‌ర్జీ.. అద్భుతం!

మంత్రి నారా లోకేష్‌పైనా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ ప్ర‌శంస‌లు కురిపించారు. యువ నాయ‌కుడిగా నారా లోకేష్ ఎన‌ర్జిటిక్‌గా ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు. సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో అద్భుతంగా ప‌నిచేస్తున్నార‌ని పేర్కొన్నారు. అంతేకాదు.. సమస్యల పరిష్కారంలో యువనేతలకు లోకేశ్ ఆదర్శమని పేర్కొన్నారు. అదేస‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం.. నిరంత‌రం త‌పిస్తున్న సీఎం చంద్ర‌బాబు ఆలోచ‌న‌ల‌ను పుణికిపుచ్చుకున్నార‌ని తెలిపారు.

త‌న‌ను అనేక సంద‌ర్భాల్లో నారా లోకేష్ ఢిల్లీలో క‌లిశార‌ని.. ఎప్పుడూ.. రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పైనే ఆయ‌న చ‌ర్చించార‌ని తెలిపారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు.. సీఎంగా చంద్ర‌బాబు, మంత్రిగా లోకేష్ నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతున్నార‌ని అన్నారు. ఇలాంటి నాయ‌కులు ఉన్న ఏపీ.. ప్ర‌జ‌లు ఎంతో అదృష్ట వంతుల‌ని పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే ఏపీ దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌కు కూడా పోటీ ఇవ్వ‌గ‌ల స్థాయికి చేరుతుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని తెలిపారు.